హద్దుదాటిన అభిమానం, జయలలిత హెచ్చరిక: ఐటీకి రూ.400 కోట్ల నష్టం
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ వైపు వరదలు, వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే... అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రం రాజకీయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు సేవ చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే... వాటి పైన 'అమ్మ' జయ బొమ్మలు ఉండాలని ఒత్తిడి తెస్తున్నారట.
పలువురు దాతలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు ఆహారపు ప్యాకెట్లు, బట్టలు, దుప్పట్లు వంటివి అందజేస్తున్నారు. అయితే, ఆ సామాగ్రి పైన ముఖ్యమంత్రి జయలలిత ఫోటోతో కూడిన స్టిక్కర్ అంటించాలని ఆ పార్టీ కార్యకర్తలు షరతు విధిస్తున్నారు. లేకుంటే సామాగ్రిని బాధితులకు చేరనివ్వమని చెబుతున్నారట.
దీంతో విమర్శలు వస్తున్నాయి. ఈ విషయం తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి జయలలిత.. తన అభిమానులు, కార్యకర్తల పైన ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. హద్దు దాటవద్దని కార్యకర్తలకు సూచించారు. ఇటీవల వరదల సమయంలో జయలలితను బాహుబలి సినిమాలోని శివగామిగా చిత్రీకరిస్తూ ఓ భారీ ఫ్లెక్సీ వెలిసిన విషయం తెలిసిందే.
వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో సహాయచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయచర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొంటున్నాయి. 50 బృందాలుగా విడిపోయిన ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది పలు ప్రాంతాల్లో బాధితులకు సాయం అందిస్తున్నారు.
చెన్నైలో భారీగా కురిసిన వర్షాలకు అనేక కుటుంబాలు సర్వం కోల్పోయాయి. నిత్యావసర వస్తువులు, బట్టలు, నగదు, సర్టిఫికేట్లు అన్నీ కోల్పోయారు. దీంతో ధ్రువీకరణ పత్రాలు పోయిన వారికి మళ్లీ కొత్త పత్రాలు ఇస్తామని మద్రాస్ వర్సిటీ వైస్ ఛాన్సులర్ ఆర్ తాండవన్ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే, పోలీస్ అధికారి ధృవీకరిస్తే ఉచితంగా సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు.
ఐటీ పరిశ్రమలకు రూ.400 కోట్ల నష్టం
చెన్నైని వరదలు చుట్టుముట్టడం వల్ల ఐటీ కంపెనీలకు రూ.400 కోట్ల నష్టం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత వారం రోజులుగా చెన్నైలో ఐటీ పరిశ్రమ ఇంచుమించు మూతపడింది. దీంతో ఐటీ పరిశ్రమకు 60 మిలియన్ డాలర్లు అంటే రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.