చెన్నై: కూతురు సర్టిఫికేట్ల కోసం వరదలోకి దిగి మృతి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం, వరదల కారణంగా ఓ విషాధ సంఘటన చోటు చేసుకుంది. చెన్నైలోని తైడీర్ నగర్ గ్రీమ్స్ రోడ్డులో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతను తన కుమార్తె సర్టిఫికేట్లు, తన రేషన్ కార్డు నీళ్లల్లో కొట్టుకుపోతుంటే వాటి కోసం వెళ్లి మృతి చెందాడు.
దీంతో అతని భార్య, పిల్లలు, బంధువులు రోధిస్తున్నారు. ఈ సంఘటన అందర్నీ కలచివేస్తోంది. భారీ వర్షాలకు పోటెత్తిన వరదనీటిలో తన రేషన్ కార్డు, కూతురు స్కూల్ సర్టిఫికెట్లు కొట్టుకుపోతున్నాయి. వాటిని తెచ్చేందుకు వెళ్లిన రవీంద్రన్ అనే వ్యక్తి వెళ్లి మృత్యువాతపడ్డాడు.
రవీంద్రన్ స్థానికంగా ఓ ప్రయివేటు కొరియర్ కంపెనీలో పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం అతను ఉంటున్న నివాసానికి వరద నీరు పోటెత్తింది. ఇంట్లోని సామాను కొట్టుకుపోసాగింది. అందులో కుటుంబ రేషన్ కార్డు, కుమార్తె సర్టిఫికెట్లు ఉన్నాయి.
దీంతో, పీకల్లోతు నీటిని కూడా లెక్క చేయకుండా వాటిని తెచ్చేందుకు వరదలో దిగాడు. ఉద్ధృతి పెరగడంతో భార్య పిల్లల ఎదుటే అతను కొట్టుకుపోయాడు. ఆ తర్వాతి రోజు రవీంద్రన్ మృతదేహం నీటిలో తేలుతూ ఆ పరిసర ప్రాంతాల్లో కన్పించడంతో స్థానికులు గుర్తించి ఒడ్డుకు తీసుకొచ్చారు.
చెన్నై నుంచి కదిలిన తొలి విమానం!
వరద సృష్టించిన బీభత్సం తర్వాత చెన్నై విమానాశ్రయం నుంచి తొలి విమానం పోర్ట్ బ్లెయిర్కు ఆదివారం ఉదయం పది గంటలకు టేకాఫ్ అయింది. ఈ ఎయిర్ ఇండియా విమానం సేఫ్గా టేకాఫ్ అయిందని, తిరిగి 1:40కి చెన్నై చేరుకునే విమానం 2:45కు న్యూఢిల్లీ బయలుదేరుతుందని అధికారులు చెప్పారు.