చెన్నైకి కేంద్రం 940 కోట్ల సాయం, తేజస్వి నెల జీతం
చెన్నై/న్యూఢిల్లీ: విపత్తు సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి అన్ని పార్టీలు ఏకమై ప్రభుత్వానికి అండగా నిలవాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు గురువారం అన్నారు. తమిళనాడులో వరద పరిస్థితి దారుణంగా ఉందని వాపోయారు.
ఇది రాజకీయాలకు, విమర్శలకు సమయం కాదని చెప్పారు. రాత్రింబవళ్లు ప్రజాసేవలో ఉన్న యంత్రాంగాన్ని నిరుత్సాహపరిచేలా విమర్శలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన వారికి వెంకయ్య అభినందనలు తెలిపారు. కష్ట కాలంలో కేంద్ర తమిళనాడుకు అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
చెన్నైకి కేంద్రం సాయం
భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో కేంద్రం భారీ సాయం ప్రకటించింది. రూ.940.92 కోట్ల తక్షణ సాయం ప్రకటించింది. మరోవైపు, ఇండియన్ నేవీ రెండువేల ఆహార పొట్లాలు, మంచినీటిని ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సరఫరా చేశారు.
చెన్నైకి ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నై బయల్దేరారు. గత కొన్ని రోజులుగా తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని మోడీ చెన్నై బయలుదేరారు. చెన్నై విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిఎంకె ఎంపీ కనిమొళి కోరారు.
చెన్నై వరదల నేపథ్యంలో తన మొదటి నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. మానవతాదృక్పథంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.