చెన్నై వరదలు: తగ్గనున్న టీసీఎస్ ఆదాయం, షేర్ల పతనం
చెన్నై: స్టాక్ మార్కెట్లో టీసీఎస్ షేర్లు ఒక్కసారిగా పతనమయ్యాయి. సోమవారం నాడే టీసీఎస్ షేర్ విలువ 2.3 శాతానికి పడిపోయింది. అంతేకాదు చెన్నైలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు కారణంగా డిసెంబర్ నెలతో ముగిసే త్రైమాసికానికి సంస్థ ఆదాయం తగ్గే అవకాశముందని టీసీఎస్ ప్రకటించింది.
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)పై చెన్నై వరదలు పెను ప్రభావాన్ని చూపాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కు ఉన్న అతి పెద్ద డెలివరీ సెంటర్లలో చెన్నై లొకేషన్ ఒకటి. ఇక్కడ 65 వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
మొత్తం టీసీఎస్ సంస్ధ సిబ్బందిలో వీరు దాదాపుగా 20 శాతం. భారీ వర్షాలు, ఆ తర్వాత తలెత్తిన వరదలతో అత్యంత ప్రధానమైన కార్యకలాపాలు మినహాయించి డిసెంబర్ 1 నుంచి నగరంలో మన సంస్థ సాధారణ వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయాయి.
డిసెంబర్ 7 నుంచి సంస్థలో వ్యాపార కార్యకలాపాలు పునఃప్రారంభించినప్పటికీ సిబ్బంది హాజరు మాత్రం తక్కువగా ఉండటంతో దీని ప్రభావం కంపెనీ ఆదాయం ఉండనుందని టీసీఎస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు రాబోయే రోజుల్లో క్రిస్మస్, న్యూఇయర్ సెలవులు సైతం అమెరికా, యూరప్ నుంచి వచ్చే ఆదాయంపై ప్రభావం చూపించనుందని పేర్కొంది.
చెన్నైలో వర్షాలు, వరదల కారణంగా ఐదురోజులపాటు కలిగిన అంతరాయం వల్ల టీసీఎస్ మూడో త్రైమాసికంలో 60 పాయింట్ల వరకు ప్రతి త్రైమాసికంలో దాని ప్రభావం ఉంటుందని పరిశీలక సంస్థ నొమురా పేర్కొంది. అంతేకాదు స్టాక్మార్కెట్లో టీసీఎస్ వాటాల క్షీణిత ధరను రూ. 2,670 నుంచి 2,500 లకు తగ్గించింది.