చెన్నై నవవధువు ఫ్యామిలీ సజీవదహనం: పఠాన్ కోట్ లింక్, సైబర్, ఫోరెన్సిక్ టీం !
చెన్నై: సొంత స్థలం చూడటానికి వెళ్లిన సమయంలో చెన్నై ఆడిటర్ జయదేవన్ ఫ్యామిలీ సజీవదహనం అయిన కేసు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో ఆడిటర్ జయదేవ్ కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతి అయ్యారా ? అని ఆరా తీస్తున్నారు.
మిస్టరీ: కారులో చెన్నై నవవధువుతో సహ ఆడిటర్ ఫ్యామిలీ సజీవదహనం
ఫోరెన్సిక్ నిపుణులు. సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి విచారణ ముమ్మరం చేశారు. నవవధువుతో సహ ఒకే కుటుంబంలో ముగ్గురు రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారులోనే సజీవదహనం కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ గొడవలు ?
ఆడిటర్ జయదేవన్ చెన్నైలో ఆడిటర్ గా పని చేస్తున్నారు. జయదేవన్ కుటుంబ సభ్యులకు చెన్నై నగర శివార్లలోని మనమై (మహాబలిపురం) దగ్గర ఓ స్థలం ఉంది. ఈ స్థలం చూడటానికి వెళ్లిన సమయంలోనే కుటుంబ సభ్యులు అందరూ అనుమానాస్పదస్థితిలో మరణించడంతో రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఎమైనా గొడవలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
నవవధువు దివ్యశ్రీ !
ఆడిటర్ జయదేవన్ భార్య రమాదేవి చిట్లపాక్కంలో ప్రైవేట్ స్కూల్ టీచర్. జయదేవన్, రమాదేవి కుమార్తె దివ్యశ్రీ (24) ఇంజనీరింగ్ విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇటీవలే శరత్ తో దివ్యశ్రీ వివాహం వైభవంగా నిర్వహించారు. మనమై ప్రాంతంలో ఉన్న స్థలం దివ్యశ్రీకి ఇవ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారని సమాచారం.
సజీవదహనం కేసుకు పఠాన్ కోట్ లింక్ !
ఆడిటర్ జయదేవన్ కుటుంబం సజీవదహనం కేసుకు పఠాన్ కోట్ కు సంబంధం ఉందని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. నవవధువు దివ్యశ్రీ భర్త శరత్ పఠాన్ కోట్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. శరత్ ఉద్యోగరీత్య పఠాన్ కోట్ లో ఉండటంతో దివ్యశ్రీ చెన్నైలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది.
కారు నిలిపిన క్షణాల్లోనే !
రాత్రి 9.30 గంటల సమయంలో జయదేవన్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్)లోని మమ్మల్లప్పురం దగ్గర రోడ్డు పక్కన నిలిపిన క్షణాల్లో అగ్నికి ఆహుతి అయ్యిందని ప్రత్యక్షసాక్షులు పోలీసులకు చెప్పారు. కారులో సాంకేతికలోపం వలన మంటలు వ్యాపించాయా ? అంటూ ఆరా తీస్తున్నారు.
సెల్ ఫోన్లు స్వాధీనం !
ఫోరెన్సీక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా ఆధారాలు సేకరించారు. సైబర్ క్రైం పోలీసులు కారులో ఉన్న జయదేవన్, రమాదేవి, నవవధువు దివ్యశ్రీల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని అందులోని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో ఒక్క ఆధారంకూడా వదిలిపెట్టకుండా పరిశీలిస్తున్నారు.
కుటుంబ కలహాలు, మరేమైనా కారణాలు ?
జయదేవన్ కుటుంబ సభ్యులకు కుటుంబ కలహాలు ఉన్నాయా, మరేమైనా కారణాలు ఉన్నాయా ? అంటూ ఆరా తీస్తున్నారు. అదే సందర్బంలో సమయం కోసం ఎదురు చూస్తున్న శుత్రువులు ఎవరైనా వీరిని సజీవదహనం చేశారా, కారులో సాంకేతిక లోపం వలన ఇలా జరిగిందా ? అంటూ ఆరా తీస్తున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
నవవధువు భర్త శరత్ !
తన భార్య దివ్యశ్రీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సజీవదహనం అయ్యారని తెలుసుకున్న శరత్ పఠాన్ కోట్ నుంచి బయలుదేరి చెన్నై చేరుకున్నారు. చంగల్ పేట్ ఆసుపత్రిలో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి శరత్ కు అప్పగించారు. నవవధువు దివ్యశ్రీతో సహ ఆమె కుటుంబ సభ్యులు సజీవదహనం అయిన కేసు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.