పన్నీర్ సెల్వంకు ఎదురు దెబ్బ: లాయర్ కపిల్ సిబల్ ఎంట్రీ, హైకోర్టు ఆదేశాలు, పదవి!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ రసవత్తరంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గంతో విలీనం అయిన పన్నీర్ సెల్వం తరువాత ముఖ్యమంత్రి పదవితో పాటు కీలక శాఖలు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు పన్నీర్ సెల్వం వర్గానికి మద్రాసు హైకోర్టులు చుక్కెదురైయ్యింది.
ఫిబ్రవరి 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని పన్నీర్ సెల్వం వర్గానికి మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

18 మంది ఎమ్మెల్యేలు
తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన టీటీవీ దినకరన్ వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేల మీద ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టులో విచారణలో ఉంది.

హైకోర్టుకు ప్రతిపక్షం
తమిళనాడు ప్రభుత్వం మీద 2017లో పన్నీర్ సెల్వంతో సహ 11 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని, శాసన సభలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బలపరీక్ష సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వీరందరూ ఓటు వేశారని డీఎంకే పార్టీ చీఫ్ విప్ చక్రపాణి మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

కపిల్ సిబల్ ఎంట్రీ
డీఎంకే పార్టీ చీఫ్ విప్ చక్రపాణి దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ బుధవారం విచారణ చేశారు. డీఎంకే పార్టీ తరపున ప్రముఖ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మద్రాసు హైకోర్టులో వాదనలు వినింపించారు.

స్పీకర్ ఏకపక్షం
అసెంబ్లీ బయట ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన 18 మంది ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వేశారని కపిల్ సిబల్ వాదించారు. అదే అసెంబ్లీలో సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేసిన పన్నీర్ సెల్వంతో సహ 11 మంది మీద స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఆయన ఏకపక్షంగా వ్యవహరించారని కపిల్ సిబల్ కోర్టులో వాదించారు.

ఉప ముఖ్యమంత్రి
పన్నీర్ సెల్వం మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారని కపిల్ సిబల్ వాదించారు. భారతదేశంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఉండదని, ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తులు అయితే ముఖ్యమంత్రి అవుతారని, లేదంటే మంత్రులుగా ఉంటారని, ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారిని మంత్రిగానే చూస్తారని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పన్నీర్ వర్గానికి ఆదేశాలు
శాసన సభ సమావేశంలో ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేశారని, మీ మీద ఎందుకు చర్యలు తీసుకోరాదు అంటూ ఫిబ్రవరి 5వ తేదీలోపు సమాధానం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ పన్నీర్ సెల్వం వర్గానికి ఆదేశాలు జారీ చేసి ఫిబ్రవరి 13వ తేదీకి పిటిషన్ విచారణ వాయిదా వేశారు.

ఇరకాటంలో ప్రభుత్వం !
మద్రాసు హైకోర్టు ఆదేశాలతో పన్నీర్ సెల్వంతో సహ ఆయన వర్గం, ప్రభుత్వం ఇరకాటంలో పడ్డారని న్యాయనిపుణులు అంటున్నారు. ఎడప్పాడి పళనిస్వామి మీద ధర్మయుద్దం పేరుతో తిరుగుబాటు చేసి ఇప్పడు ఒక్కటి అయిన పన్నీర్ సెల్వం వర్గం హైకోర్టుకు ఏం సమాధానం చెబుతుందో అని అందరూ వేచి చూస్తున్నారు.












Click it and Unblock the Notifications