జయలలిత కుమార్తె కేసు: జయ రక్తం సేకరించారా ? అపోలోకు హైకోర్టు ప్రశ్న, డీఎన్ఏ!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమె రక్తం స్యాంపిల్స్ సేకరించారా ? లేదా ? అనే విషయం చెప్పాలని చెన్నైలోని అపోలో ఆసుపత్రిని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. దాదాపు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందిన జయలలితకు ఎన్నిసార్లు రక్త పరీక్షలు నిర్వహించారు ? వాటిని భద్రపరిచారా ? అనే పూర్తి సమాచారం ఇవ్వాలని మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రికి ఆదేశాలు జారీ చేసింది. జయలలిత కుమార్తె తానే అంటూ బెంగళూరుకు చెందిన అమృత దాఖలు చేసిన పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు అపోలో ఆసుపత్రిని ప్రశ్నించింది.
1980లో జయలలిత !
చెన్నైలోని మైలాపూర్లో ఉన్న జయలలిత నివాసంలో తాను జన్మించానని, కొన్ని కారణాల వల్ల తనను జయలలిత బెంగళూరులో నివాసం ఉంటున్న సోదరి శైలజ కుమార్తెగా తనను ప్రపంచానికి పరిచయం చేశారని అమృత మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్లో వివరించారు.
లలిత, రంజని !
జయలలిత మరణం తర్వాత తన సమీప బంధువులు రంజని, లలితల ద్వారా తనకు అసలు విషయం తెలిసిందని అమృత చెబుతున్నారు. తాను జయలలిత కుమార్తెను అని నిరూపించుకోవటానికి జయలలిత సమాధి నుంచి డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించమని అధికారులను ఆదేశించాలని అమృత మద్రాసు హై కోర్టులో మనవి చేశారు.
అపోలోకు నోటీసులు
జయలలిత అపోలో ఆసుపత్రిలో 75 రోజులు చికిత్స పొంది మరణించారు. జయలలితకు చికిత్స చేసే సమయంలో ఆమె రక్తం, చర్మం, తల వెంట్రుకలు ఏమైనా సేకరించారా ? లేదా ? అని చెప్పాలని, ఆ నమూనాలతో తాను డీఎన్ఏ పరీక్షలు నిర్వహించుకోవాలని అమృత 2018 జనవరి 18వ తేదీ అపోలో ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు.
జయ సమాధి నుంచి !
జయలలిత సమాధి నుంచి ఆమె తల వెంట్రుకలు, శరీర అవయవాల నుంచి సేకరించే నమూనాలతో డీఎన్ ఏ పరీక్షలు చెయ్యడం సమస్యతో కూడుకున్న పని అని, అపోలో ఆసుపత్రిలో ఆమె రక్త నమూనాలు ఉంటే త్వరగా డీఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి ఆస్కారం ఉంటుందని, మీరు అపోలో ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశ్నించాలని బెంగళూరు నివాసి అమృత మద్రాసు హైకోర్టులో మని చేశారు.
అమృత పిటిషన్
శుక్రవారం అమృత పిటిషన్ విచారణ చేసిన మద్రాసు హైకోర్టు జయలలిత రక్త నమూనాలు విషయంలో సమాధానం ఇవ్వాలని అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హైకోర్టు పిటిషన్ విచారణ మార్చి 7వ తేదీకి వాయిదా వేసింది.
దీపా ఆరోపణ
బెంగళూరుకు చెందిన అమృత మా మేనత్త ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి ఆమె కూతురు అంటూ నాటకం ఆడుతుందని జయలలిత మేనకోడలు దీపా ఆరోపించారు. జయలలితకు వివాహం కాలేదని, ఆమెకు కుమార్తె లేదని దీపా అంటున్నారు.
అయోమయం
జయలలిత కుమార్తె అంటున్న బెంగళూరుకు చెందిన అమృత విషయంలో ఏవిధంగాను స్పంధించకుండా అన్నాడీఎంకే పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమృత విషయం కోర్టులో ఉన్నందున ఇటు తమిళనాడు ప్రభుత్వం సైతం మౌనంగా ఉంటోంది.