శశికళ, ఇళవరసి విచారణకు కర్ణాటక అనుమతి, బెంగళూరు జైల్లో ఐటీ విచారణ, కథ సమాప్తం !
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ, ఆమె వదిన ఇళవరసిని విచారణ చెయ్యడానికి చెన్నై ఆదాయపన్ను శాఖ అధికారులకు కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు.
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళ, ఆమె వదిన ఇళవరసిని విచారణ చెయ్యడానికి చెన్నై ఆదాయపన్ను శాఖ అధికారులకు కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. మీకు వీలైనప్పుడు జైళ్ల శాఖ నిబంధనల ప్రకారం విచారణ చేసుకోవచ్చని ఐటీ శాఖకు మంగళవారం సాయంత్రం సమాచారం ఇచ్చారు.
చెన్నై నగరంతో పాటు తమిళనాడు, బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీలో శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల నివాసాల్లో 187 ప్రాంతాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేశారు. చెన్నైలోని ఇళవరసి కుమారుడు వివేక్, ఆమె కుమార్తెలు కృష్ణప్రియ, షకీల ఇళ్లలో సోదాలు చేశారు.
శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్, ఆమె సోదరుడు దివాకరన్ ఇళ్లలో, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసి రూ. వేల కోట్ల విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శశికళ అనేక బినామీ కంపెనీల పేర్లతో రూ. వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాధించారని అధికారుల విచారణలో వెలుగు చూసింది.
బినామీ కంపెనీలకు శశికళ, ఆమె వదిన ఇళవరసి డైరెక్టర్లుగా ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ సందర్బంలో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి శశికళ, ఇళవరసిని విచారణ చెయ్యడానికి అవకాశం ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు కర్ణాటక జైళ్ల శాఖ అధికారులకు లేఖ రాశారు. ఆదాయపన్ను శాఖ లేఖలు పరిశీలించిన కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు చిన్నమ్మ, ఆమె వదినను విచారణ చెయ్యడానికి మీరు ఏ రోజు అయినా రావచ్చు అంటూ మంగళవారం సాయంత్రం సమాచారం ఇచ్చారు.