రాధిక ఇంట్లో ఏం దొరకలేదా? 'పన్నీరు కొడుకును అరెస్ట్ చేయొద్దు'
నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ను ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం మరోసారి ప్రశ్నించారు.
చెన్నై: నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ను ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం మరోసారి ప్రశ్నించారు. ఆయనను ప్రశ్నించడం ఇది మూడోసారి. మంత్రి విజయ భాస్కర్ నివాసంలో దాడుల అనంతరం శరత్ కుమార్ కార్యాలయాల్లోను ఐటీ ఆధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
శరత్ కుమార్ను ఐటీ అధికారులు మంగళవారం తొలిసారి ప్రశ్నించారు. చెన్నైలోని ఐటీ కార్యాలయంలో ప్రశ్నించారు. శశికళ వర్గంకు చెందిన టీటీవీ దినకరన్కు మద్దతు తెలిపిన మరుసటి రోజే శరత్ కుమార్ ఆస్తులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
బుధవారం శరత్ కుమార్, ఆయన సతీమణి రాధికను అధికారులు ప్రశ్నించారు. ఈ రోజు (గురువారం) మూడోసారి ఆయనని ప్రశ్నించారు.
మరోవైపు, శరత్ కుమార్ - రాధిక ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన అధికారులకు ఎలాంటి ఆధారాలు, పత్రాలు లభించలేదని తెలుస్తోంది.
పన్నీరుసెల్వం కొడుకును అరెస్ట్ చేయవద్దు
మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం కొడుకును అరెస్టు చేయవద్దని మద్రాస్ హైకోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది. ఏప్రిల్ 17వ తేదీ వరకు అతనిని అరెస్ట్ చేయవద్దని చెప్పింది.
ఆర్కే నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో గొడవ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు భావించారు. దీంతో వీరు కోర్టుకు వెళ్లారు. ఏప్రిల్ 17వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని కోర్టు చెప్పింది.