ఐటీ దాడులు: రూ. కారులో 24 కోట్ల కొత్త నోట్లు, శేఖర్ రెడ్డివే?
చెన్నై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని వేలూరు (చిత్తూరు జిల్లా బార్డర్)లో శనివారం రూ. 24 కోట్ల కొత్త నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై/వేలూరు: అక్రమంగా కోట్ల రూపాయల విలువైన కొత్తనోట్లను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న వాహనాన్ని చెన్నై ఆదాయ పన్ను శాఖ (ఐటీ) అధికారులు సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దులోని వేలూరు (చిత్తూరు జిల్లా బార్డర్)లో శనివారం రూ. 24 కోట్ల కొత్త నోట్లు ఉన్న వాహనాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు.
శనివారం వేలూరు సమీపంలో అనుమానాస్పందంగా వెళుతున్న వాహనాన్ని ఐటీ అధికారులు వెంబడించారు. తరువాత వాహనం అడ్డుకుని పరిశీలించారు. వాహనంలో రూ. 24 కోట్ల విలువైన కొత్ల కరన్సీ నోట్లు ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
గత మూడు రోజుల నుంచి చెన్నైలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డికి చెందిన రూ. 170 కోట్ల (నగదు), 130 కేజీల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదే కేసులో అక్రమంగా నగదు రవాణా చేస్తున్నారని ఆరోపిస్తూ శేఖర్ రెడ్డి బంధువులు, వ్యాపారవేత్తలు ప్రేమ్ రెడ్డి, శ్రీనివాస రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. చెన్నైతో పాటు వేలూరులో సోదాలు చేశారు.
ఇప్పుడు శేఖర్ రెడ్డి ఇసుక వ్యాపారానికి కేంద్ర బిందువైన వేలూరులో రూ. 24 కోట్లు పట్టుబడటంతో ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బు శేఖర్ రెడ్డిదే అని ఐటీ అధికారులు పైకి చెబుతున్నా అధికారికంగా దృవీకరించవలసి ఉంది.