జయ వేలిముద్రలు, మేం జోక్యం చేసుకోం: హైకోర్టు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉప ఎన్నికల్లో (తమిళనాడు శాసన సభ ఉప ఎన్నికలు) పోటీచేస్తున్న ఏఐఏడీఎంకే అభ్యర్థుల నామినేషన్ పత్రాలపై సంతకం బదులు వేలిముద్ర వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమని, ఎన్నికల సంఘం అధికారులే నామినేషన్ పత్రాల్లో ప్రామాణికతను ధృవీకరిస్తారని ఆ పిల్ ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఇప్పటికే ఎన్నికల గుర్తులు కేటాయించారని కోర్టు గుర్తు చేసింది.
ఇలాంటి చివరి నిమిషయంలో తాము జోక్యం చేసుకోవడం సరైయ్యింది కాదని మద్రాసు హై కోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోపాలైనా తలెత్తితే, వాటిని కోర్టులో సవాల్ చేయడానికి అవకాశం ఉంటే అప్పుడు అది ఎలక్షన్ పిటిషన్ కిందకు వస్తుందని మద్రాస్ హై కోర్టు స్పష్టం చేసింది.
నెల రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత కోలుకుంటున్నారని చెబుతున్నా ఆమె దగ్గర నామినేషన్ పత్రాల్లో సంతకం చేయించుకోకుండా వేలి ముద్రలు వేయించారని సవాలు చేస్తూ సమాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్రాస్ హై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
తమిళనాడులోని తంజవూరు, అరవకురిచ్చి, తిరుప్పరాంగుండ్రం శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని పిటిషనర్ కోర్టులో మనవి చేశారు.
ఇదే సమయంలో ప్రభుత్వం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలోనే సీఎం జయలలిత వేలిముద్రలు వేశారని, ఈ వేలిముద్రలు చెల్లుబాటు అవుతాయని సీఈసీ కూడా స్పష్టం చేసిందని వివరించారు.
అందు వలనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి సైతం వేలిముద్రల వేసిన బీఫాంలపై అమోద ముద్ర వేశారని వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తరపున వాదనలను సమర్థించిన మద్రాసు హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.