ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో మరో ట్విస్ట్.. అప్పుడేమో నటితో పరార్..! ఇప్పుడేమో మరో కోణం..!!
చెన్నై : తిరుచ్చిలోని ప్రముఖ జ్యువెల్లరీ షాపులో ఇటీవల జరిగిన దొంగతనంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల మేర చోరీ దొంగతనం జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దొంగల ముఠా నేత మురుగన్ వ్యవహరించిన తీరు ట్విస్టుల మీద ట్విస్టులు తలపిస్తోంది. దోచుకున్న నగలతో పాటు తాను ఎంచుకున్న దారి చూస్తే ఎంతటి వారైనా విస్మయానికి గురి కావాల్సిందే. దోచిన 13 కోట్లల్లో 3 కోట్ల విలువ చేసే నగలు ఇతరులకు పంచేసి 10 కోట్ల రూపాయల నగలతో పరారైన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఎంత పెద్ద చోరీలైనా భార్యతో కలిసి రెక్కీ నిర్వహిస్తాడనేది మరో కోణంగా పోలీసుల దర్యాప్తులో తేలింది.
సినిమా సీన్ తలపించిన జ్యువెల్లరీ షోరూమ్ చోరీ
తిరుచ్చిలోని ప్రముఖ నగల దుకాణంలో ఇటీవల జరిగిన దొంగతనం సినిమా సీన్ తలపించింది. 13 కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు చోరీకి గురి కావడంతో దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అయితే ఈ కేసులో దొంగల ముఠా నేత మురుగన్ హస్తముందని తేలడం.. రోజుకో ట్విస్ట్ బయటపడటం హాట్ టాపికైంది. చోరీ తర్వాత ఓ నటితో పరారైనట్లు వార్తలొచ్చాయి. అదలావుంటే ఈ ముఠా సభ్యుడు పోలీసులకు పట్టుబడి కొన్ని వివరాలు వెల్లడించడంతో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి.
కీలక సమాచారం వెల్లడించిన మేనల్లుడు
ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు, మురుగన్ మేనల్లుడు సురేశ్ను తిరుచ్చి ప్రత్యేక పోలీసుల బృందం ఈ నెల 14వ తేదీన వారం రోజుల కస్టడీకి తీసుకుంది. ఆ నేపథ్యంలో మురుగన్కు సంబంధించి సురేశ్ కీలక సమాచారం వెల్లడించాడు. 13 కోట్ల విలువైన నగలు దోచుకెళ్లిన జ్యువెల్లరీ షాపు చోరీ కేసులో.. ఆ షోరూమ్కు భార్యతో కలిసి మురుగన్ చాలాసార్లు వెళ్లాడని అంగీకరించాడు. అదే క్రమంలో అక్కడి పరిస్థితులు అంచనా వేశాడని వివరించాడు. కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ అత్యంత పకడ్బందీగా చోరీ చేసిన విధానం పోలీసులను నివ్వెర పరిచింది. ఆ క్రమంలో సురేశ్ వెల్లడించిన వివరాలతో మురుగున్ చోరీ చేసిన తంతు కళ్లకు కట్టినట్లు అయింది.
కారు గెలుపా, కాంగ్రెస్ విజయమా.. ఉప ఎన్నిక ప్రశాంతం.. ఇక ఫలితాలపై ఉత్కంఠ..!
భార్యతో కలిసి రెక్కీ.. నేరుగా స్పాట్లోకి ఎంట్రీ
చోరీకి ముందు సదరు జ్యువెల్లరీ షోరూమ్కు భార్యతో కలిసి మురుగన్ చాలాసార్లు వెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు సురేశ్. భార్య ఆభరణాలు చూస్తుంటే.. మురుగన్ మాత్రం షోరూమ్ మొత్తం కలియతిరిగి అక్కడి పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చేవాడట. ఆ క్రమంలోనే దొంగతనానికి వెళ్లినప్పుడు.. నగలు ఎక్కడైతే పెద్ద మొత్తంలో భద్రపరుస్తారో సరిగ్గా అక్కడే గోడకు కన్నం వేసి భారీ చోరీకి పాల్పడినట్లు సురేశ్ వెల్లడించాడు. అదలావుంటే ఎక్కడైనా సరే ఇలా పెద్ద చోరీకి ప్లాన్ చేసినప్పుడు కొద్ది నెలల ముందు ఆ ఏరియాలో కుటుంబంతో సహా అడ్డా వేసేవాడని.. అక్కడే రూమ్ అద్దెకు తీసుకుని ఉండేవాడని.. చోరీ తర్వాత మకాం మార్చేవాడని తెలిపాడు.
చోరీ చేసే ఏరియాలోనే అద్దెకు ఉంటూ..!
అంతకుముందు పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోరీకి పాల్పడిన సమయంలో కూడా ఇలాగే ఆ బ్యాంక్ ఉన్న ఏరియాలో అద్దె ఇల్లు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అయితే ఇదివరకు ఇతర కేసులో పట్టుబడ్డ మురుగన్ అచ్చు గుద్దినట్లు సురేశ్ చెప్పిన విషయాలే వెల్లడించినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. చెన్నైలో చోరీలకు పాల్పడిన సమయంలో పోలీసులకు దొరక్కుండా ఆ శాఖ అధికారులకు భారీ నజరానాలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఓ పోలీస్ అధికారికి 30 లక్షల నగదు.. ఇంకో అధికారికి ఖరీదైన కారు.. ఓ సినీ నటికి కాస్ట్లీ ఆభరణాలు.. గిఫ్ట్గా ఇచ్చాడని సురేశ్ పోలీస్ దర్యాప్తులో వివరించడం కొసమెరుపు.
ప్రగతి భవన్ ముట్టడి టెన్షన్ టెన్షన్.. రచ్చ రచ్చ.. ఆర్టీసీ జేఏసీ 10 రోజుల కార్యాచరణ
పోలీస్ అధికారులకు ఖరీదైన కానుకలు..!
చెన్నై ఈసీఆర్ ప్రాంతంలో ఖరీదైన బంగళాతో పాటు విలువైన ఆస్తులున్న మురుగన్ విలాసవంతమైన జీవితానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ క్రమంలో అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అతడికి నిత్యకృత్యంగా మారినట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్న మురుగన్.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. అతడు ఢిల్లీ నుంచి మొదలుపెడితే ఇటు కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాల్లో ఎన్నో దోపిడీలకు పాల్పడినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.