ఆ జ్యువెల్లరీ షాపు చోరీలో ట్విస్ట్.. నగలు దోచాడు.. నటితో పరారయ్యాడు..!
చెన్నై : తిరుచ్చిలోని ఓ ప్రముఖ జ్యువెల్లరీ షాపులో జరిగిన దొంగతనంలో కొత్త ట్విస్ట్ బయటపడింది. దాదాపు 13 కోట్ల రూపాయల మేర చోరీ దొంగతనం జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఈ కేసు మరో మలుపు తిరిగింది. దొంగల ముఠా నేత వ్యవహరించిన తీరు ఔరా అనిపిస్తోంది. దోచుకున్న నగలతో పాటు తాను ఎంచుకున్న దారి చూస్తే ఎంతటి వారైనా విస్మయానికి గురి కావాల్సిందే. దోచిన 13 కోట్లల్లో 3 కోట్ల విలువ చేసే నగలు ఇతరులకు పంచేసి 10 కోట్ల రూపాయల నగలతో పరారైన తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
స్కెచ్ వేసి.. సినిమా సీన్.. నటితో పరార్..!
తిరుచ్చిలోని ప్రముఖ నగల దుకాణంలో జరిగిన దొంగతనం సినిమా సీన్ తలపిస్తోంది. 13 కోట్ల రూపాయల విలువ చేసే ఆభరణాలు చోరీకి గురయ్యాయనే విషయం దేశ వ్యాప్తంగా చర్చానీయాంశమైంది. అయితే ఈ కేసులో దొంగల ముఠా నేత వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపికైంది. దోచుకున్న 13 కోట్ల రూపాయల విలువ చేసే నగలకు గాను 10 కోట్ల రూపాయలను తన వెంట తీసుకుని ఓ నటితో పరారైనట్లు తెలుస్తోంది.
ఇద్దరూ కలిసి శ్రీలంకకు చేరుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడైతే సేఫ్గా ఉండొచ్చనేది సదరు దొంగల ముఠా నేత అంతరంగంగా కనిపిస్తోందని పోలీసులు చెబుతుండటం గమనార్హం. తిరుచ్చి సత్రం సమీపంలోని నగల దుకాణంలో ఈ నెల 2వ తేదీన జరిగిన ఈ భారీ చోరీ దేశ వ్యాప్తంగా అలజడి రేపిన సంగతి తెలిసిందే.
10 కోట్ల రూపాయలతో శ్రీలంకకు పరార్..!
తిరువారూరు మాడపురానికి చెందిన మణికంఠన్ ఈ చోరీ కేసులో నిందితుడు. అయితే నాలుగు కిలోల బంగారు ఆభరణాలతో పోలీసులకు పట్టుబడటంతో పలు విషయాలు వెలుగు చూశాయి. దర్యాప్తులో భాగంగా మణికంఠన్ పోలీసులకు చాలా సమాచారం అందించినట్లు టాక్ వినిపిస్తోంది. దొంగల ముఠా నేత మురుగన్.. సురేశ్ అనే వ్యక్తితో పాటు పేరు మోసిన దొంగైన అతడి మామతో కలిసి ఈ నగల దుకాణం చోరీకి స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో అంగీకరించాడు మణికంఠన్. ఆ ఇద్దరితో జత కట్టిన మురుగన్ 13 కోట్ల విలువ చేసే నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపాడు. అదలావుంటే మురుగన్ 10 కోట్ల రూపాయల విలువ చేసే నగలతో శ్రీలంకకు పరారైనట్లు అతడి ద్వారా తెలిసింది.
చెన్నైలో ఖరీదైన బంగాళా, విలువైన ఆస్తులు.. అమ్మాయిలతో జల్సా..!
చెన్నై ఈసీఆర్ ప్రాంతంలో ఖరీదైన బంగళాతో పాటు విలువైన ఆస్తులున్న మురుగన్ విలాసవంతమైన జీవితానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ క్రమంలో అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అతడికి నిత్యకృత్యంగా మారినట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్న మురుగన్.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. అతడికి ఢిల్లీ నుంచి మొదలుపెడితే ఇటు కన్యాకుమారి వరకు ఆయా ప్రాంతాల్లో ఎన్నో దోపిడీలకు పాల్పడినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
అమ్మాయిలతో సరాదాగా గడపడం అలవాటున్న మురుగన్.. ఈ చోరీ తర్వాత ఓ నటిని వెంటబెట్టుకుని శ్రీలంకకు పారిపోయినట్లు మణికంఠన్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నగల షాపు దోపిడీకి సంబంధించి నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. మొత్తానికి శ్రీలంకలో మకాం వేసిన మురుగన్ను ఎలా పట్టుకుంటారో.. ఇక్కడకు ఎలా తెప్పిస్తారో చూడాలి.