తల్లి, భార్య, కుమారుడు, కుమార్తె గొంతులు కోసి చంపిన వ్యాపారి, జీఎస్ టీ దెబ్బ !
చెన్నై: బట్టల వ్యాపారంలో ఎక్కువ నష్టం వచ్చిందని జీవితంపై విరక్తి పెంచుకున్న వ్యాపారి తల్లి, భార్య, ఇద్దరు బిడ్డలను దారుణంగా హత్యచేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చెన్నైలో జరిగింది. నలుగురుని దారుణంగా హత్య చేసిన వ్యాపారి ప్రకాష్ అలియాస్ దామోదరన్ (42) ఇప్పుడు చెన్నైలోని జీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడుతున్నాడు.
దారుణంగా చంపేశాడు
చెన్నైలోని పల్లవరం సమీపంలోని పంబల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రకాష్ అలియాస్ దామోదరన్ తల్లి సరస్వతి, భార్య దీపా (37), కుమారుడు రోషన్ (7), కుమార్తె మీనాక్షి (5)ని గొంతులు కోసి దారుణంగా హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు.
వడ్డీకూడా ఇవ్వలేక !
ప్రకాష్ అలియాస్ దామోదరన్ తన వ్యాపారాభివృద్ధి కోసం పలువురి దగ్గర రుణం తీసుకున్నాడు. అయితే ఆశించిన రీతిలో ప్రకాష్ వ్యాపారం అభివృద్ధి చెందలేదు. దీనికి తోడు అప్పుల భారం పెరిగి కనీసం వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీతో సహా అసలు మొత్తం ఇచ్చేయాలని రుణం ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు.
నెల రోజుల నుంచి !
రుణం ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో కుమిలిపోయిన ప్రకాష్ నెలరోజుల నుంచి కుటుంబ సభ్యులు ఎవ్వరితో సరిగా మాట్లాడకుండా ఉంటున్నాడు. విషయం గమనించిన ప్రకాష్ భార్య దీపా భర్తను ప్రశ్నించింది. వ్యాపారం సరిగా జరగడం లేదని, అప్పులు ఇచ్చినవారు ఒత్తిళ్లు చేస్తున్నారని, ఎలా తీర్చాలో తెలియడం లేదని ప్రకాష్ ఆవేదన చెందాడు.
ఆత్మహత్య చేసుకోవాలి
రాత్రి ఇంటికి వెళ్లిన ప్రకాష్ అలియాస్ దామోదరన్ భార్య, పిల్లలను దగ్గర కూర్చోపెట్టుకుని సంతోషంగా గడిపాడు. ఆ తరువాత భార్యపిల్లలు నిద్రపోయిన తరువాత ఆత్యహత్య చేసుకోవాలని నిర్ణయించాడు. తాను ఆత్మహత్య చేసుకుంటే అప్పులు ఇచ్చిన వారు మా కుటుంబ సభ్యులను వేధిస్తారని ప్రకాష్ అనుమానించాడు.
ఎవ్వరూ ఉండకూడాదు !
ఆత్యహత్య అంటూ చేసుకుంటే కుటుంబంతో సహా అందరూ చనిపోవాలని ప్రకాష్ నిర్ణయించాడు. వేకువ జామున బావమరిది రాజాకు ఫోన్ చేసి నేను చేసిన అప్పులు తీర్చలేక పోతున్నాను, నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పిన ప్రకాష్ ఫోన్ కట్ చేశాడు.
దారణంగా గొంతులు కోశాడు
ఆవేశంలో వంటగదిలోకి వెళ్లిన ప్రకాష్ కత్తి తీసుకు వచ్చి భార్య దీపా నోటిని చేతితో అదిమి గొంతుకోశాడు. ఆ తరువాత తల్లి సరస్వతి గదిలోకి వెళ్లి గొంతు కోసి చంపేశాడు. అనంతరం కుమారుడు రోషన్, కుమార్తె మీనాక్షి గొంతుకోశాడు. ఆ తరువాత అదే కత్తితో ప్రకాష్ గొంతు కోసుకున్నాడు.
బావమరిదికి అనుమానం
ప్రకాష్ బావమరిది రాజా ఫోన్చేస్తే ఎవరూ తీయకపోవడంతో ఆందోళనతో ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ప్రకాష్ ఇల్లంతా రక్తపుమడుగులతో నిండిపోగా ఒక గదిలో అతని తల్లి సరస్వతి, భార్య దీపా ప్రాణాలు పోయిన స్థితిలో పడి ఉన్నారు. ప్రకాష్, ఇద్దరు పిల్లలు ప్రాణాపాయ స్థితిలో గిలగిల కొట్టుకుంటున్నారు.
మార్గం మధ్యలో పిల్లలు !
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో పడిఉన్న ప్రకాష్, ఆయన కుమారుడు రోషన్, కుమార్తె మీనాక్షిని ఆసుపత్రికి తరలించారు. అయితే పిల్లల్లు ఇద్దరూ మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారని వైద్యులు చెప్పారు.
జీఎస్ టీ కారణంగా అప్పులు !
ప్రకాష్ అలియాస్ దామోదరన్ చెన్నై జీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ప్రకాష్ రాసిన ఐదు పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాష్ అలియాస్ దామోదరన్ రాసిన సూసైడ్ నోట్ లో జీఎస్టీ కారణంగా తాను అప్పుల పాలైనానని, అందుకే ఇలా చేస్తున్నానని రాశాడని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.