ఎస్పీ బాలు మరణానికి కారణమదే... ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం : చెన్నై ఎంజీఎం వైద్యులు
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెదడులో రక్తస్రావం, శ్వాసకోశ సమస్యల కారణంగానే ఆయన కన్నుమూశారని చెప్పారు. వెంటనే ఆ సమస్యలను గుర్తించి చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయామన్నారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు దీపక్ సుబ్రమణ్యన్, సభానాయగం ఒక ప్రకటన విడుదల చేశారు.
Recommended Video
నా పేరు ముందు అవి వాడకండి - ఎస్పీ బాలు రాసిన లేఖ వైరల్- గాన చంద్రుడన్న సోనియా గాంధీ
అది మినహా.. ఏ అనారోగ్య సమస్య లేదు..
గత ఆగస్టు 3న జలుబు, జ్వరం రావడంతో ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. స్వల్పంగా కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడటంతో తమ సూచన మేరకు బాలు ఆస్పత్రిలో చేరారన్నారు. అంతకుముందు,ఏడేళ్ల క్రితం ఊబకాయం తగ్గించుకునేందుకు ఆపరేషన్ చేయించుకున్నారని... అది తప్ప ఆయనకు వేరే అనారోగ్య సమస్యలేవీ లేవన్నారు. డయాబెటీస్ కూడా లేదన్నారు. డైట్ విషయంలోనూ జాగ్రత్తపడేవారని తెలిపారు.
అమెరికా,ఫ్రాన్స్ వైద్యుల సలహాతో...
అగస్టు 5న ఆయన ఆస్పత్రిలో చేరగా... 3 రోజుల వరకు చికిత్స బాగానే జరిగిందన్నారు. అగస్టు 9న ఆయన శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించామన్నారు. అగస్టు 13న వెంటిలేటర్పై చికిత్స అందించామని... మరుసటిరోజు ఎక్మో పరికరం అమర్చి చికిత్స అందించామన్నారు. అమెరికా, ఫ్రాన్స్ వైద్యులను సంప్రదించి... వారిచ్చిన సలహాలు,సూచనలతో చికిత్స చేశామన్నారు. అది ఫలించి ఆయన స్పృహలోకి వచ్చారని... అందరినీ గుర్తుపట్టారని చెప్పారు. సెప్టెంబర్ 5న వివాహవార్షికోత్సవం కూడా చేసుకున్నారని తెలిపారు.
అందుకే కాపాడలేకపోయాం...
నోటి ద్వారా ఆహారం తీసుకుంటూ నెమ్మదిగా కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే... గురువారం(సెప్టెంబర్ 24) హఠాత్తుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందన్నారు. వైరస్ శరీరమంతా వ్యాపించడంతో పలు అవయవాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మెదడులో రక్తస్రావమైనట్లు సిటీ స్కాన్లో గుర్తించామన్నారు. వాటికి తోడు శ్వాసకోశ సమస్యలు కూడా రావడంతో ఆయన శరీరం చికిత్సకు స్పందించలేదన్నారు. దీంతో ఆయన్ను కాపాడాలేకపోయామని చెప్పారు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 1.04గం. సమయంలో ఆయన మృతి చెందినట్లు తెలిపారు.