పోయెస్ గార్డెన్ లో కలెక్టర్, అధికారులు, శశికళకు సినిమా, జయ మేనకోడలు దీపా, దీపక్ కు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బుధవారం మరోసారి పరిశీలించారు. చెన్నై కలెక్టర్ అన్బుసెల్వన్ ఆధ్వర్యంలోని అధికారులు పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం పరిశీలించి పూర్తి సమాచారం సేకరించారు. వేదనిలయం విషయంలో శశికళకు సినిమా చూపించి జయలలిత మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ కు ఏదో ఒకటి చెయ్యాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది.
స్మారకభవనం
ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం విలీనం అయిన సమయంలో పలుడిమాండ్లు తెరమీదకు వచ్చాయి. శశికళ, టీటీవీ దినకరన్, వారి కుటుంబ సభ్యులను అన్నాడీఎంకే పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని, వేదనిలయాన్ని అమ్మ స్మారకభవనం చెయ్యాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు.
ఒకే చెప్పిన సీఎం
వేదనిలయాన్ని జయలలిత స్మారకభవనం చేస్తామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధికారికంగా ప్రకటించారు. స్మారకభవనం ఏర్పాట్లు చెయ్యడానికి వేసిన ప్రత్యేక కమిటీలో చెన్నై కలెక్టర్ అన్బుసెల్వం, రెవెన్యూ, తదితర సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.
శశికళ ఫ్యామిలీ
వేదనిలయం శశికళ మేనల్లుడు, జయా టీవీ సీఇవో వివేక్, అతని సోదరి క్రిష్ణప్రియ ఆధీనంలో ఉంది. ఇటీవల ఆదాయపన్ను శాఖ అధికారులు శశికళ ఫ్యామిలీ మీద మెరుపుదాడులు చేసిన సమయంలో వివేక్ దగ్గర ఉన్న వేదనిలయం తాళం ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రెండు గదులు సీజ్
పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో శశికళకు సంబంధించిన రెండు గదుల్లో సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు అందులోని కీలకపత్రాలు, హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని గదులు సీజ్ చేసి తాళం వారి దగ్గరే పెట్టుకున్నారు.
కోర్టుకు దీపా, దీపక్
జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంకు తామే వారసులని, ఆ భవనం మాకు స్వాధీనం చెయ్యాలని అమ్మ మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్ కోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
వేదనిలయం విలువ ?
చెన్నై కలెక్టర్ అన్బుసెల్వన్, రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే మూడు సార్లు వేదనిలయం, ఆవరణంలోని స్థలం పరిశీలించి కొలతలు వేసి దాని విలువ ప్రస్తుత మార్కెట్ లో ఎంత ఉంది అని ఓ అంచనాకు వచ్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
పళని, పన్నీర్ ప్లాన్
వేదనిలయం విషయంలో న్యాయస్థానం దీపా, దీపక్ కు అనుకూలంగా తీర్పు ఇస్తే దాని విలువ ఎంతఉందో అంతే విలువైన స్థలాన్ని దీపా, దీపాకు పరిహారంగా ఇవ్వాలని, ఇంటిని మాత్రం అమ్మ స్మారకభవనంగా ఏర్పాటు చెయ్యాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారని తెలిసింది.
శశికళకు ఏం సంబంధం ?
జయలలిత ఇంటిని శశికళ కుటుంబ సభ్యులు ఏం అధికారంతో వారి ఆధీనంలో పెట్టుకున్నారని అన్నాడీఎంకే పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏమైనా పరిహారం చెల్లించాల్సి వస్తే దీపా, దీపక్ కు మాత్రమే చెల్లించాలని, శశికళ కుటుంబ సభ్యులను దూరం పెట్టి సినిమా చూపించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించిందని సమాచారం.