ప్రేమ, పెళ్లి పేరుతో నాలుగు దిక్కుల్లో నలుగురు పెళ్లాలు, నెల కాపురం, మోజు తీరిందిని!
చెన్నై: ప్రేమ పేరుతో అమాయకులైన అమ్మాయిలను వరుసగా పెళ్లిళ్లు చేసుకుని మాయం అవుతున్న నిత్య పెళ్లి కొడుకుని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త కనపడటం లేదని ఓ అమాయకురాలు ఫిర్యాదు చెయ్యడంతో దర్యాప్తు చేసిన పోలీసులకు దిమ్మతిరిగింది. నవ వరుడు కనపడకుండా పోలేదని, పారిపోయాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ఇప్పటి వరకు నిత్య పెళ్లి కొడుకు నాలుగు దిక్కుల్లో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని, నెల రోజులు కాపురం చేసి మోజు తీరడంతో మాయం అయ్యాడని, అతని వయసు 23 ఏళ్లు మాత్రమే అని పోలీసులు తెలిపారు.
బనియన్ కంపెనీలో ఉద్యోగం
తమిళనాడులోని తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపంలోని ఒక్కనాడు కీళయూరులో నివాసం ఉంటున్న రాజ్ కుమార్ కుమారుడు సంతోష్ కుమార్ అలియాస్ సంతోష్ (23). తిరువూరులోని ఓ బనియన్ కంపెనీలో కొంత కాలం నుంచి సంతోష్ ఉద్యోగం చేస్తున్నాడు.
40 రోజుల క్రితం మాయం
కరువిలక్కాడు గ్రామానికి చెందిన సత్యభామా అలియాస్ సత్య (20) అనే యువతనిని ఐదు నెలల క్రితం సంతోష్ వివాహం చేసుకున్నాడు. తరువాత తిరువూరులో సత్యతో సంతోష్ కాపురం పెట్టాడు. 40 రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సంతోషం తరువాత సత్యకు కనపడకుండా మాయం అయ్యాడు.
కాలేజ్ అమ్మాయితో పెళ్లి
తిరువూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్ కు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని సంతోష్ వలలో వేసుకున్నాడు. ప్రేమ పేరుతో కాలేజ్ అమ్మాయికి దగ్గర అయిన సంతోష్ ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత కీళయూరులో కాలేజ్ అమ్మాయితో సంతోష్ కాపురం పెట్టాడు.
మూడో భార్య ఫిర్యాదుతో!
తన భర్త సంతోష్ గత 40 రోజుల నుంచి కనపడటం లేదని సత్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ ఫోటో చేతిలో పెట్టుకుని వెతకడం మొదలుపెట్టారు. అదే సమయంలో కాలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంతోష్ కీళయూరులో కాపురం పెట్టాడని తెలుసుకున్న సత్య షాక్ కు గురై పోలీసులకు సమాచారం ఇచ్చింది.
నాలుగు దిక్కుల్లో నలుగురు భార్యలు
సత్య సమాచారం ఇవ్వడంతో కీళయూరుకు వెళ్లిన తిరువూర్ పోలీసులు సంతోష్ ను అదుపులోకి తీసుకుని బెండ్ తీశారు. సత్యను, కాలేజ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోకముందే మరో ఇద్దరు అమ్మాయిలను వివాహం చేసుకున్నానని సంతోష్ అంగీకరించాడు. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిలను వివాహం చేసుకుని కొన్ని నెలలు కాపురం చేసి మోజు తీరడంతో సంతోషం మాయం అవుతున్నాడని పోలీసులు అన్నారు. సంతోష్ ను అరెస్టు చేసి పట్టుకోటై మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి జైలుకు పంపించామని తిరువూర్ పోలీసులు తెలిపారు. 23 ఏళ్ల వయసులోనే సంతోష్ ఎన్నో నాటకాలు ఆడాడని, ఇతని వలలో ఇంకా ఎంత మంది యువతులు మోసపోయారో అనే విషయం ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.