షాకింగ్ : లాక్ డౌన్ వేళ లిక్కర్ దందాలో సినీ సహాయ నటుడు.. పక్కా సమాచారంతో అరెస్ట్..
దాదాపు నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో మందు బాబులకు పెద్ద కరువు వచ్చి పడినట్టయింది. మందు లేక చాలామంది తాగుబోతుల ప్రాణాల విలవిల్లాడిపోతున్నాయి. ఎక్కడైనా గుక్కెడు చుక్క దొరక్కపోదా అని తెలిసిన సర్కిల్స్లో వాకబు చేస్తున్నారు. ఇదే అదనుగా కొన్నిచోట్ల అక్రమ లిక్కర్ దందా షురూ అయిపోయింది. వైన్ షాపుల నుంచి అక్రమంగా రెసిడెన్షియల్ కాలనీలకు తరలించి.. సీక్రెట్ ఏజెంట్ల ద్వారా మద్యాన్ని విక్రయిస్తున్నారు. సాధారణ ధర కంటే ఏడెనిమిది రెట్లు ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తూ అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా చెన్నైలోనూ ఇలాంటి ఘటనే బయటపడింది.
సహాయ నటుడి అరెస్ట్
లాక్ డౌన్ కారణంగా తమిళనాడులోని చెన్నైలో మద్యం షాపులన్నీ మూతపడ్డాయి. దీంతో కొందరు దొంగచాటుగా మద్యం విక్రయాలకు తెరలేపారు.చెన్నైలోని ఎంజీఆర్ నగర్లోని ఓ ఇంట్లో అక్రమ మద్యం విక్రయాలను తాజాగా పోలీసులు బట్టబయలుచేశారు. రిస్కాన్(30) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తమిళ సినిమాల్లో సహాయ నటుడిగా చేసే రిస్కాన్ లాక్ డౌన్ వేళ మద్యం అమ్మకాలతో సొమ్ము చేసుకుంటున్నాడని గుర్తించారు. తాను నివాసం ఉండే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లోనే ఫోన్ల ద్వారా మందుబాబుల నుంచి ఆర్డర్స్ తీసుకుని సీక్రెట్ ఏజెంట్స్ ద్వారా సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. పక్కా సమాచారంతో అతని ఇంటిపై దాడులు చేసి అరెస్ట్ చేశారు.
ధరలు ఏ రేంజ్లో పెంచి అమ్ముతున్నారంటే..
సాధారణ రోజుల్లో కేవలం రూ.250-రూ.300 ఉండే విస్కీ క్వార్టర్ బాటిల్ను రిస్కాన్ రూ.1200కి విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. రిస్కాన్ స్నేహితుల్లో కొంతమంది ఒక గ్యాంగ్గా ఏర్పడి మద్యం సప్లై చేస్తున్నట్టు గుర్తించారు. వారి వద్ద నుంచి ఒక్కో క్వార్టర్ బాటిల్ రూ.1000కి కొనుగోలు చేసి రూ.1200 అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు. విచారణలో రిస్కాన్ వెల్లడించిన వివరాలతో మరికొంతమందిని గుర్తించి అరెస్ట్ చేశారు.
మరో ఇద్దరి అరెస్ట్.. కొనసాగుతున్న దర్యాప్తు..
రిస్కాన్ ఇచ్చిన సమాచారంతో చూలైమేడు, కామరాజ్నగర్కు చెందిన కాల్ టాక్సీ డ్రైవర్ దేవరాజ్, సాలిగ్రామం, దివాకర్నగర్కు చెందిన ప్రదీప్ అనే వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల సందర్భంగా దేవరాజ్ కారులో 189 మద్యం బాటిళ్లు రూ.20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్యాంగ్ కేవలం చెన్నైలోనే లిక్కర్ దందా చేస్తోందా... లేక తమిళనాడువ్యాప్తంగా లింకులు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.