Coronavirus: లాక్ డౌన్, రోడ్లలో ప్రజలు హల్ చల్, కరోనా హెల్మెట్ తో పరుగో పరుగు, సూపర్ !
చెన్నై: కరోనా వైరస్ (COVID 19) వ్యాధిని అరికట్టడానికి భారతదేశంలో హెల్త్ ఎమర్జెన్సీ (లాక్ డౌన్) అమలు చేసిన నేపథ్యంలో అనేక ప్రాంతాల్లోని ప్రజలు చెప్పిన మాట వినకుండా రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రజలు అందరూ ఇళ్లలోనే ఉండాలని, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించరాదని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో సహ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మనవి చేసినా కొందరు ప్రజలు మాట వినడం లేదు. ఈ సమయంలో కరోనా వైరస్ ను లెక్కచెయ్యకుండా రోడ్ల మీద విచ్చలవిడిగా తిరుగుతున్న ప్రజలకు బుద్ది చెప్పడానికి పోలీసులు కరోనా హెల్మెట్ లను తెర మీదకు తీసుకు రావడంతో ప్రజలు పరుగో పరుగు అంటున్నారు. కరోనా వైరస్ ఎంత భయంకరంగా ఉంటుందో ప్రజలకు అర్థం అయ్యేలా కరోనా హెల్మెట్ లతో పోలీసులు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడంతో ప్రజలు ఇళ్లలోకి పరుగు తీస్తున్నారు.
Coronavirus కాటు: చైనా నుంచి వచ్చి తప్పించుకుని ఊరూరు తిరిగేశాడు, సీఎం ఊరిలో!
కరోనా చాప కింద నీరులా !
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. కరోనా వైరస్ ను కట్టడి చెయ్యడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేశారు. కరోనా వైరస్ ను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో జనాభా కదలికలు తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజలు మాట వినడం లేదు
కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు మాత్రం చెప్పిన మాట వినడం లేదు. కరోనా వైరస్ ను నిరోధించడానికి ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగా ఉండటంతో ప్రభుత్వం, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
తెర మీదకు కరోనా హెల్మెట్
తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి సోకిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ఇంత చేస్తున్నా తమిళనాడులో వాహనచోదకులు చెప్పిన మాట వినకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. ఒక బైక్ లో ఇద్దరు, ముగ్గురు సంచరించడంతో తమిళనాడు పోలీసులు తెర మీదకు కరోనా హెల్మెట్ లు తెచ్చారు.
ఇలా ప్రాణం పోతుంది చూడు !
చెన్నైలోని విల్లిక్కవం పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు ప్రతిరోజు ఆయన విధులు నిర్వహిస్తున్న ప్రాంతంలో బైక్ లో సంచరించరాదని ఎంత చెప్పినా యువకులు మాత్రం మాట వినడం లేదు. అంతే సుమన్ గౌతమ్ అనే ఓ కళాకారుడి సహాయంతో కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు (లోగో) ఎలా ఉంటాయో అలాగే హెల్మెట్ డిజైన్ చేయించిన ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు దానిని ఆయనే తలకు పెట్టుకుని రోడ్డు మీద నిలబడ్డారు. కరోనా వైరస్ వలన ఇలా ప్రాణాలు పోతాయి చూడండి అంటూ బైక్ లో సంచరిస్తున్న వారికి ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు గట్టిగా చెబుతున్నారు.
నేను మీ బైక్ లో వస్తానంటే పరుగో పరుగు !
రోడ్డు మీద భయంకరంగా ఉన్న కరోనా హెల్మెట్ ని పెట్టుకున్న ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబును చూసిన కొందరు స్థానిక పిల్లలు మనం ఇంటికి వెళ్లిపోదామని అక్కడే తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేశారు. అంతేకాకుండా బైక్ లో తిరుగుతున్న యువకులను నిలుపుతున్న ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు నేను ఇలాగే కరోనా హెల్మెట్ మీ బైక్ లో కుర్చుని వస్తాను, అందుకు మీరు అంగీకరిస్తారా ? చెప్పండి అంటూ ప్రశ్నిస్తున్నారు. చూడటానికి భయంకరంగా ఉన్న కరోనా హెల్మెట్ లాగే కరోనా వైరస్ అంతకంటే భయంకరంగా ఉంటుందని, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు.
కరోనా హెల్మెట్లు ఎలా చేశారంటే !
దెబ్బతిన్న కొన్ని హెల్మెట్లకు పేపర్ల సహాయంతో కరోనా వైరస్ ఆకారంలో కరోనా హెల్మెట్లు తయారు చేశామని ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు వివరించారు. ప్రజలు రోడ్ల మీద నుంచి ఇళ్లకు పంపించడానికి ఈ కరోనా హెల్మెట్లు ఉపయోగ పడుతోందని, ఇలాంటి కరోనా హెల్మెట్లు డిజైన్ చెయ్యడానికి సుమనే గౌతమ్ అనే కళాకారుడు సహకరించాడని ఇన్స్ పెక్టర్ రాజేష్ బాబు మీడియాకు చెప్పారు.