చెన్నైలో భారీ వర్షాలు, మళ్లీ 2015 సీన్ రిపీట్, కరుణానిధికి తప్పని వరదల కష్టాలు, హై అలర్ట్ !
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న జడివానలతో చెన్నై నగరంతో పాటు సముద్ర తీర ప్రాంతాలు ముప్పునకు గురైనాయి.
చెన్నై: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న జడివానలతో చెన్నై నగరంతో పాటు సముద్ర తీర ప్రాంతాలు ముప్పునకు గురైనాయి. చెన్నై నగరంలోని ప్రజలు మరో సారి వరదలు వస్తాయని భయంతో ఆందోళన చెందుతున్నారు.
Recommended Video
2015 డిసెంబర్ తరువాత చెన్నై నగరంలో రికార్డుస్థాయిలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాల కారణంగా చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. చెనైలోని ప్రముఖుల నివాసాల్లోకి వర్షం నీరు చేరుకునింది.
కరుణానిధికి తప్పని వరదల కష్టాలు
డీఎంపీ పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితర ప్రముఖుల ఇళ్లలోకి వర్షం నీరు చేరుకునింది. విషయం తెలుసుకున్న గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది కరుణానిధి, పన్నీర్ సెల్వం ఇంటికి చేరుకుని వర్షం నీటిని బయటకు పంపించారు.
కేంద్ర విపత్తుల నిర్వహణ
చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతాల్లో వర్షం నీట మునిగిన ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
సినీ నటుల సహాయం
ప్రముఖ సినీ నటులు విశాల్, హీరో సూర్య సోదరుడు, బహుబాష నటుడు కార్తి, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ తదితరులు చెన్నై నగరంలో అన్నం లేక ఆర్తనాదాలు చేస్తున్న పేదలకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. పలు స్వచ్చంద సంస్థలు సహాయక చర్యలకు తమ వంతు సహకారం అందిస్తున్నాయి.
శనివారం భారీ వర్షాలు !
శనివారం కూడా చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని సముద్ర తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, నాగపట్టణం తదితర జిల్లాల్లో అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఆ జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.
తమిళనాడులో హై అలర్ట్
చెన్నై నగరంతో పాటు ఐదు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తమిళనాడు ప్రభుత్వం మనవి చేసింది. చెన్నై నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 115 బహుళ ప్రయోజన ఆశ్రయాలు ఏర్పాటు చేశామని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.