మద్యం మత్తులో ఏడీజీపీ కూతురు?: కానిస్టేబుల్కు వార్నింగ్!, వీడియో తీసినా..
Recommended Video
చెన్నై: తమిళనాడు అదనపు డీజీపీ తమిళ్ సెల్వన్ కూతురు సోమవారం అర్ధరాత్రి చెన్నై బీచ్లో వీరంగం సృష్టించింది. మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. తన వాహనాన్ని ఆపిన కానిస్టేబుల్తో వాగ్వాదానికి దిగింది.
'నన్నే అడ్డుకుంటావా? నేనొక ఐపీఎస్ అధికారి కూతుర్ని. నిన్ను ఉద్యోగం నుంచి తీసేయిస్తా' అని ఆ కానిస్టేబుల్ను హెచ్చరించింది. అంతేగాక, వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి.. తనను ఆపిన కానిస్టేబుల్ను విధుల నుంచి తొలగించాలని చెప్పింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియోను ఆ కానిస్టేబుల్ చిత్రీకరించారు. ఆమె కారులో మద్యం సీసాలు ఉండటం ఆ వీడియోలో రికార్డైంది. చెన్నైలోని పాలక్కం బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి వాహనంలో వెళుతున్న సమయంలో పోలీస్ కానిస్టేబుల్ ఆమెను అడ్డుకొని.. తనిఖీకి సహకరించాలని కోరాడు.
అయితే, మద్యం మత్తులో ఉన్నట్లు కనిపిస్తున్న ఆమె.. విధుల్లో ఉన్న ఆ కానిస్టేబుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడింది. ఉద్యోగం తీసేయిస్తానని హెచ్చరించడంతోపాటు తమకు ఇబ్బంది కలిగించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కానిస్టేబుల్ అతిగా ప్రవర్తించాడని, వద్దని వారిస్తున్నా వీడియో తీసి.. తమకు ఇబ్బంది కలిగించాడని ఫిర్యాదులో పేర్కొంది.
సదరు కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరింది. కాగా, స్థానిక పోలీసు అధికారులు మరో వాదన వినిపించారు. సదరు కానిస్టేబుల్ మద్యం మత్తులో ఉన్నాడని, కారును ఆపి.. కారులోని వారిని డబ్బులు ఇవ్వాలని కోరాడని వారు చెప్పడం గమనార్హం.