కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల ధర్నా: జయలలిత సమాధి దగ్గర లాఠీచార్జ్ !
చెన్నై: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. నీట్ పరీక్షను తమిళనాడులో రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తూ బుధవారం చెన్నై నగరంలోని మెరీనా బీచ్ లోని తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సమాధి దగ్గర ధర్నా నిర్వహించారు.
బుధవారం చెన్నైలోని అనేక కాలేజ్ ల విద్యార్థులు ఒక్క సారిగా మెరీనా బీచ్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు ముందుగా పసిగట్టకపోవడంతో వందలాది మంది విద్యార్థులు మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి దగ్గరకు చేరుకుని ధర్నా నిర్వహించారు.
జయలలిత నీట్ పరీక్షను వ్యతిరేకించారని, కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేశారని ఈ సందర్బంగా విద్యార్థులు గుర్తు చేశారు. తమిళ ప్రజలు, విద్యార్థుల మనోభావాలు పట్టించుకోకుండా నీట్ పరీక్షను తమిళనాడుకు మినహాయించకపోవడంతో దళిత విద్యార్థి అనిత ప్రాణం పోయిందని చెప్పారు.
వెంటనే నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. జయలలిత సమాధి దగ్గర ధర్నా విరమించాలని పోలీసులు సూచించారు. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నించారు. చివరికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి విద్యార్థులను అక్కడి నుంచి పక్కకు లాగేశారు. జయలలిత సమాధి దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.