కలకలం: కత్తులు చేతబట్టి, రైలుకు వేలాడుతూ యువకుల వీరంగం
కొందరు యువకులు చేతులతో కత్తులు పట్టుకుని కదులుతున్న రైల్లో ద్వారానికి వేలాడుతూ వీరంగం సృష్టించారు.
చెన్నై: కొందరు యువకులు చేతులతో కత్తులు పట్టుకుని కదులుతున్న రైల్లో ద్వారానికి వేలాడుతూ వీరంగం సృష్టించారు. ఇది చూసిన ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకులను అరెస్ట్ చేశారు.
యువకుల చేతిలో కత్తులు..
చెన్నైలోని లోకల్ రైలులో ప్రయాణిస్తున్న కొందరు యువకులు చేతుల్లో కత్తులు, రాడ్లు పట్టుకుని హల్చల్ చేశారు. ఒక చేత్తో రైలును పట్టుకుని వేలాడుతూ.. మరో చేత్తో కత్తులు, రాడ్లను తిప్పుతూ వీరంగం సృష్టించారు.
పోలీసులు అప్రమత్తం
రైలు దిగిన తర్వాత కూడా ఆ యువకులు స్టేషన్లోనే బాణసంచా పేల్చారు. దీనికి సంబంధించి ఓ వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అప్రమత్తమైన దర్యాప్తు చేపట్టారు.
నలుగురు యువకుల అరెస్ట్
ఈ ఘటనలో నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు యువకులను ప్రశ్నిస్తున్నామన్నారు. వీరంతా ఓ ప్రభుత్వ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు. వీరిలో ఓ విద్యార్థి సదరు వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
పూజా.. బెదిరింపా..
ఈ వ్యవహరాంలో పట్టాభిరామ్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న చెన్నై కళాశాల విద్యార్థి దండపాణిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు తెలిపిన వివరాల మేరకు తిరువళ్లూరు జిల్లా పాక్కం గ్రామానికి చెందిన విఘ్నేష్, జగదీషన్, బాలమురళీకృష్ణన్ తదితరులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధపూజ చేయాలన్న ఉద్దేశంతోనే కత్తులతో ప్రయాణించినట్టు విద్యార్థులు తెలిపారు. అయితే, ప్రత్యర్థి వర్గం వారిని భయపెట్టడానికే వారు కత్తులతో సంచరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నలుగురిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి పుళల్ జైలుకు తరలించారు.