జయకు చికిత్స ఇలా: 12 గంటలకు అపోలో ప్రకటన ? (ఫోటో)
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంపై సోమవారం మద్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం విషమించిందని తెలుసుకున్న అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. మాతో పాటు మీరందరూ జయలలిత ఆరోగ్యంగా కొలుకోవాలని ప్రార్థనలు చెయ్యాలని అపోలో ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
జయలలితకు ఆదివారం సాయంత్ర గుండెపోటు రావడంతో ఆమెను మళ్లీ ఐసీయూ వార్డుకు మార్చారు. ఆమె త్వరగా కొలుకోవాలని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు.
సెప్టెంబర్ 22వ తేదిన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్ కారణంగా జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి అమ్మ అపోలో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇంత కాలం అన్నాడీఎంకే నాయకులు, అపోలో వైద్యులు అమ్మ ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతూ వచ్చారు.
జయలలిత సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని ఇటీవేలే అపోలో వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జయలలితకు ఒక్క సారిగా గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రి వైద్యులు షాక్ కు గురైనారు.
జయలలితకు 'ఎక్స్ ట్రాకార్పోరియల్ ముంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్' అమర్చారని, ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షణలో చికిత్స చేస్తున్నారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి. జయలలితకు ఎలాంటి చికిత్స అందించాలన్న విషయంపై లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ బాలేని ఎప్పటికప్పుడు అపోలో వైద్యులు సంప్రదిస్తున్నారని సమాచారం.
12 గంటలకు కచ్చితంగా చెబుతాం ?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషయంపై సోమవారం మద్యాహ్నం 12 గంటలకు అధికారికంగా ఓ ప్రకటన చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్యులు చెప్పారని అన్నాడీఎంకే వర్గాలు అంటున్నాయి.
ఉదయం 11 గంటలకు తమిళనాడు మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా చర్చించి ఓ నిర్ణయం తీసుకుని అదే విషయం ప్రజలకు చెప్పాలని అన్నాడీఎంకే నాయకులు నిర్ణయించారని సమాచారం. ఎప్పుడెప్పుడు మద్యాహ్నం 12 గంటలకు అవుతుందా ? అంటూ అమ్మ అభిమానులు టెన్షన్ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.