కోటీశ్వరుడు: మాజీ భర్తను కిడ్నాప్ చేసింది
చెన్నై: ఆస్తి కోసం విడాకులు ఇచ్చిన మాజీ భర్తను కిడ్నాప్ చేసిన భార్య, ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యాలని మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీసీఐడీకి సూచించింది.
కోటీశ్వరుడైన బాధితుడిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని న్యాయస్థానం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైకి చెందిన మనోజ్ రాజన్ ను మధురై సమీపంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
చెన్నైకి చెందిన పారిశ్రామిక వేత్త రాజన్, లిస్సీ రాజన్ దంపతులకు 1979లో మనోజ్ జన్మించాడు. మనోజ్ పుట్టకతోనే చెవిటి, మూగ. అతనికి వయస్సుతో పాటు అతని మానసిక స్థితి ఎదగలేదు. 1993లో మనోజ్ తల్లి లిస్సీ మరణించారు.
తరువాత మనోజ్ ను ప్రత్యేక స్కూల్ లో చేర్పించారు. 2008లో రాజన్ తన కుమారుడు మనోజ్ కు ఓ సంబంధం చూసి ప్రియదర్శిని అనే యువతితో వివాహం జరిపించాడు. అయితే తనను కనీసం భార్యగా చూడటం లేదని, నన్ను పట్టించుకోవడం లేదని ప్రియదర్శిని కోర్టును ఆశ్రయించింది.
భరణం కింద రూ. నాలుగు లక్షలు తీసుకుని విడాకులు తీసుకుంది. 2013లో మనోజ్ తండ్రి రాజన్ మరణించారు. మనోజ్ కు మళ్లి కష్టాలు మొదలైనాయి. రాజన్ మరణించక ముందు తనకు నమ్మకస్తులైన అనంతన్, బంధువు రుడోల్స్ ఇనే ఇద్దరికి మనోజ్ తో పాటు అతని ఆస్తిని అప్పగించారు.
అప్పటి నుంచి వారిద్దరూ మనోజ్ ను చెన్నైలోనే ఓ ప్రత్యేక భవనంలో ఉంచారు. అయితే విషయం తెలుసుకున్న ప్రియదర్శిని తన మాజీ భర్తను కిడ్నాప్ చేశారని మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. కోర్టులో కేసు విచారణ జరిగింది.
మనోజ్ మాజీ భార్య ప్రియదర్శిని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. తరువాత గత మే నాలుగవ తేదిన ప్రియదర్శిని తన బంధువులతో కలిసి మనోజ్ ను కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతంలో దాచి పెట్టింది.
రెండు రోజుల తరువాత తన మాజీ భర్తను మళ్లీ వివాహం చేసుకుంది. మనోజ్ ను రక్షించాలని అతని సంరక్షకుడు అనంతన్ మద్రాస్ హై కోర్టును ఆశ్రయించాడు. మనోజ్ ను వెతికి పట్టుకురావాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
పోలీసులు కష్టపడి మనోజ్ ను వెతికి పట్టుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. గత మే నెల 6వ తేదిన మనోజ్ ని ప్రియదర్శిని మళ్లీ వివాహం చేసుకుందని వెలుగు చూసింది. అదే రోజు మనోజ్ పేరుతో ఉన్న రూ. 1.6 కోట్ల ఆస్తి విక్రయించినట్లు అతని దగ్గర సంతకం తీసుకున్న విషయం వెలుగు చూసింది.
మానసిక పరిస్థితి సరిగాలేని వ్యక్తి దగ్గర ఆస్తి అమ్మినట్లు సబ్ రిజిస్టార్ ఎలా సంతకం తీసుకుంటారని కోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. మనోజ్ కు, అతని ఆస్తికి ప్రమాదం ఉందని తెలుసుకున్న న్యాయస్థానం మనోజ్ ను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది.
మనోజ్ ను కిడ్నాప్ చేసి అక్రమంగా అతని ఆస్తిని విక్రయించిన ప్రియదర్శిని, ఆమెకు సహకరించిన బంధువుల మీద కేసు నమోదు చెయ్యాలని న్యాయస్థానం పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు సీబీసీఐడికి అప్పగించారు.