తెలివి తెల్లారినట్టే ఉంది..!బిర్యానీతో పాటు 40 వేలు సమర్పించుకున్న జీనియస్ ఉమెన్..!!
చెన్నై/హైదరాబాద్ : ఆర్డర్ చేసిన డెబ్బై రూపాయల బిరియాని రాకపోయేసరికి తిరిగి ఆ డెబ్బై రూపాయలను పొందడానికి ఏకంగా 40వేల రూపాయలు డిపాజిట్ చేసింది సదరు మహిళ. 70 రూపాయలు తిరిగి పొందడానికి 40వేల రూపాయలను విడతల వారీగా డిపాజిట్ చేసిన సదరు మహిళ కనిపిస్తే ఆమే అపారమైన తెలివి తేటలకు సన్మానిస్తామంటున్నారు నెటిజన్లు.
అసలు విషయం ఏంటంటే బిర్యానీని ఆర్డర్ చేసిన యువతికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ చుక్కలు చూపించింది. బిర్యానీ రాకపోగా 40 వేల రూపాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఉబర్ ఈట్స్ సంస్థ చేసిన ఈ నిర్వాకంపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. చెన్నై సౌకార్పేటకు చెందిన ఇరవై ఒక్క ఏళ్ల ప్రియా అగర్వాల్ బుధవారం ఉదయం ఉబర్ ఈట్స్ కంపెనీకి ఆన్లైన్లో హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేసింది. బిర్యానీ ధర 76 రూపాయలు ఆన్లైన్ ద్వారానే చెల్లించింది.
అయితే అకస్మాత్తుగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో ఉబర్ ఈట్స్ కాల్ సెంటర్కు ఫోన్ చేయగా, మీరు చెల్లించిన 76 రూపాయలు తిరిగి పొందాలంటే ముందుగా 5 వేల రూపాయలు చెల్లించండి, మేము 5,076 రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని తెలిపారు. వారు చెప్పిన ప్రకారమే 5 వేల రూపాయలు చెల్లించినా డబ్బు వెనక్కి రాలేదు. దీంతో మరలా కాల్ సెంటర్ను సంప్రదించగా మరోసారి 5 వేల రూపాయలు చెల్లించండని చెప్పారు.
ఇలా 8 సార్లు 5 వేల రూపాయల చొప్పున మొత్తం 40 వేల రూపాయలు చెల్లించింది. అయితే ఆమె 76 రూపాయలతో పాటూ 40 వేల రూపాయలను కూడా కోల్పోయింది. తాను మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన ప్రియా అగర్వాల్ చెన్నై వడపళని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సైబర్ క్రైం పోలీసులు ముందుగా ఆమెకు చివాట్లు పెట్టి తర్వాత విచారణ జరుపుతామని సదరు మహిళకు చెప్పినట్టు సమాచారం.