ఆ 6 బ్యాంకుల చెక్కులు చెల్లవు: ఎస్బీఐ కీలక ప్రకటన
న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు కీలక సూచన చేసింది. ఇటీవల ఎస్బీఐలో విలీనమైన ఆరు బ్యాంకులకు చెందిన పాత చెక్బుక్లు, ఐఎఫ్ఎస్ కోడ్లు సెప్టెంబర్ 30 నుంచి చెల్లబోవని స్పష్టం చేసింది.
అంతేగాక, సదరు బ్యాంకు ఖాతాదారులు వెంటనే కొత్త చెక్బుక్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనేర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమైన విషయం తెలిసిందే.
We request customers of SBI's erstwhile Associate banks and Bharatiya Mahila Bank to apply for new SBI Cheque books as soon as possible. pic.twitter.com/iWhq4xtbrn
— State Bank of India (@TheOfficialSBI) September 20, 2017
కాగా, ఈ అనుబంధ బ్యాంకుల్లోని ఖాతాదారులు ఇప్పటికీ పాత చెక్బుక్లనే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 నుంచి ఆ పాత చెక్బుక్లతో పాటు ఐఎఫ్ఎస్ కోడ్లు కూడా పనిచేయబోవని ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.
తమ ఖాతాదారులు వీలైనంత త్వరగా కొత్త చెక్బుక్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే కొత్త ఐఎఫ్ఎస్ కోడ్లు కూడా పొందాలని ఎస్బీఐ పేర్కొంది. ఇంటర్నెట్, మొబైల్ బ్యాకింగ్, ఏటీఎం లేదా సొంత బ్యాంకు బ్రాంచీల నుంచి ఈ కొత్త చెక్బుక్లను తీసుకోవచ్చని భారతీయ స్టేట్ బ్యాంక్ వివరించింది.