ఠారెత్తిస్తున్న ఎండలు.. చిరపుంజి వెళ్లాల్సిందే.. తప్పదు
భానుడు దేశ వ్యాప్తంగా తన ప్రతాపం చూపుతూ మండుటెండలతో ఠారెత్తిస్తున్నాడు. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది.
షిల్లాంగ్: వరుణదేవుడు మొహం చాటేయడంతో అగ్నిదేవుడు విజృంభిస్తున్నాడా అన్నట్లుంది పరిస్థితి చూస్తుంటే. భానుడు దేశ వ్యాప్తంగా తన ప్రతాపం చూపుతూ మండుటెండలతో ఠారెత్తిస్తున్నాడు. కొద్ది రోజులుగా భారత ఉపఖండమంతా కుతకుతలాడిపోతోంది. ఈశాన్య భారతంలోనూ రోజురోజుకీ ఉష్టోగ్రతలు పెరిగిపోతున్నాయి.
ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే.. ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళన అందరిలోనూ మొదలైంది. పోనీ సేద తీరేందుకు కొన్నిరోజులపాటు ఏదైనా హిల్ స్టేషన్ కు పోదామా అంటే.. ఇంకా పిల్లల వార్షిక పరీక్షలు కూడా పూర్తి కాలేదాయె.
చిరపుంజిలో సీన్ రివర్స్..
అయితే దేశమంతా ఎండలు మండిపోతుంటే చిరపుంజిలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేది ఇక్కడే అయినప్పటికీ.. గత 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడ 251 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిజానికి ఫిబ్రవరి నెలలో చిరపుంజిలో ఈ స్థాయిలో వర్షపాతం గతంలో ఎన్నడూ నమోదు కాలేదు. గత పదేళ్లుగా చూసుకుంటే.. ఇప్పటి వరకు ఫిబ్రవరి నెలలో 52.9 మిల్లీమీటర్ల వర్షపాతమే అత్యధికం. కానీ నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇరవై నాలుగేళ్ల క్రితం ఒకసారి ఇలాగే ఫిబ్రవరి 17వ తేదీన కుండపోతగా స్థాయిలో కురిశాయి.