'హాఫ్ గర్ల్ఫ్రెండ్': ఇంగ్లీష్ రాకుంటే అమ్మాయి డేటింగ్ నో!
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత చేతన్ భగత్ రాసిన హాఫ్ గర్ల్ఫ్రెండ్ అక్టోబర్ 1న లాంచ్ అయింది. ఆయన రాసిన 'వన్ నైట్ @ కాల్ సెంటర్', '2 స్టేట్స్', 'వాట్ యంగ్ ఇండియా వాంట్స్', 'ద 3 మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్', 'రివల్యూషన్ 2020', 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' వంటి రచనలు ఎంతో ప్రజాదరణ పొందాయి.
చేతన్ రచనలు బాలీవుడ్ చిత్రాలుగానూ తెరకెక్కాయి. వాటిలో 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' నవల '3 ఇడియట్స్'గా రూపుదిద్దుకుంది. అది పెద్ద విజయం సాధించింది. అయితే, చేతన్ భగత్ తాజా నవల హాఫ్ గర్ల్ఫ్రెండ్ ఆవిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది.
ఈ సందర్భంగా చేతన్ మాట్లాడారు. ఆంగ్లం ఇప్పుడు భారత్లో ఓ నూతన కుల వ్యవస్థలా మారిందని, ఓ వ్యక్తికి గర్ల్ఫ్రెండ్ను, జాబ్ను ఇంగ్లిషే డిసైడ్ చేస్తోందన్నారు. ఆంగ్ల పరిజ్ఞానం లేని వ్యక్తి ఉద్యోగం సంపాదించుకోలేడని, ఇంగ్లిష్ సరిగా రాని వ్యక్తితో అమ్మాయిలు డేటింగ్కు ముందుకు రారని అభిప్రాయపడ్డారు.
ఈ అంశాల ఆధారంగానే హాఫ్ గర్ల్ఫ్రెండ్ నవల రాశానని చేతన్ భగత్ చెప్పారు. బీహార్కు చెందిన గ్రామీణ యువకుడు ఢిల్లీలోని సంపన్న వర్గానికి చెందిన రియా అనే అందాలరాశితో ప్రేమలో పడతాడని... అదే తన నవల ఇతివృత్తమని తెలిపారు.
కాగా, చేతన్ భగత్ ఈ ఏడాది జనవరి నెలలో ఏఏపీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పైన సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి (ఎఎపి)కి చేతన్ భగత్ ఒకప్పుడు గట్టి మద్దతుదారు. కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుటు భగత్ సెటైర్లు వేశారు. రాజకీయాల్లో ఎఎపిని ఐటం గర్ల్గా ఆయన అభివర్ణించారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ జనవరి నెలలో నడి రోడ్డు పైన ధర్నాకు దిగారు. దీనిని చేతన్ భగత్ తప్పు పట్టారు. ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ స్పందించారు. కేజ్రీవాల్, ఆయన సహచరులు రెండు రోజుల పాటు చేసిన ధర్నాను చూసి తాను సిగ్గుపడుతున్నానని అన్నారు. వారి ధర్నాతో ఢిల్లీలో ట్రాఫిక్ స్తంభించిపోయిందన్నారు.
వ్యాపారంపై ప్రభావం చూపిందన్నారు. లోకసభ ఎన్నికల్లో గెలుపొందేందుకు, ఇప్పటికిప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటున్నారని, అదేలా అంటే బాలీవుడ్లో ఒక నటి ఏమీ చేయలేని స్థితిలో ఐటమ్ గర్ల్గా మారిపోతుందని, అలానే రాజకీయాలలో ఎఎపి కూడా అలా మారిపోయిందన్నారు.