తాను నిర్మించిన జైలులో ఖైదీగా మాజీ మంత్రి!
ముంబై: ఒకప్పుడు మంత్రిగా ఉన్న ఛగన్ భుజ్బల్ తన ఆధ్వర్యంలో పటిష్ఠ భద్రతతో ప్రత్యేకంగా ఆ జైలు సెల్ నిర్మాణం చేయించారు. అది కూడా ఒక ఉగ్రవాది కోసం. కాగా, యాధృచ్ఛికమో మరెంటో తెలియదు గానీ ఇప్పుడు అదే జైలు సెల్లో తానే బందీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందాయనకు. ఇలా జరుగుతుందని ఎవరో ఎందుకు? అతనూ ఊహించకపోవచ్చు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర ఎన్సీపీ నేత ఛగన్ భుజ్బల్ గతంలో ప్రజా పనుల విభాగం మంత్రిగా ఉన్నప్పుడు 26/11 ముంబై పేలుళ్ల కేసులో ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది కసబ్ కోసం ఆర్థర్ రోడ్ జైలులో ప్రత్యేకంగా బరాక్ 12 పేరుతో సెల్ నిర్మించారు. అప్పటి మంత్రిగా ఆయనే స్వయంగా సెల్ నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
కాగా, మనీలాండరింగ్, మహారాష్ట్ర సదన్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న భుజ్బల్ను ప్రస్తుతం అధికారులు అదే జైలులో ఉంచారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. ఆయనతో పాటు ముంబైలో సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో నిందితులు, మీడియా టైకూన్ పీటర్ ముఖర్జీ అదే సెల్లో ఉన్నారు.
వారిద్దరూ బరాక్ 12లో ఉన్న విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు ధ్రువీకరించారు. అంతేకాదు పీటర్ ముఖర్జీకి వస్తున్న ఇంటి భోజనాన్ని భుజ్బల్ కూడా పంచుకుంటున్నారట. కాగా, పీటర్కు కోర్టు ఇంటి భోజనానికి అనుమతి ఇచ్చింది.. కానీ భుజ్బల్కు ఇవ్వలేదు.
కాగా, కసబ్ను ఎరవాడ జైలుకు పంపేవరకు బరాక్ 12లోనే ఉంచారు. ఇప్పుడు దీనిని మరిన్ని సెల్స్గా విభజించి హై ప్రొఫైల్ నిందితుల కోసం ఉపయోగిస్తున్నారు అధికారులు.