దీపికాకు షాక్: చపాక్ చిత్రం విడుదలకు ముందే వివాదాలు,కోర్టుకు వెళతానంటూ..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకోన్ ప్రధాన పాత్రలో నటించిన చెపాక్ చిత్రాన్ని విడుదలకు ముందే వివాదాలు చుట్టేస్తున్నాయి. 2005లో ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్ అనే యువతిపై యాసిడ్ దాడి జరిగిన ఉదంతాన్ని తీసుకుని చిత్రం రూపొందించారు. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ పాత్రను దీపికా పదుకోన్ చేస్తోంది. నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్ తరపున కోర్టుల్లో వాదిస్తున్న అడ్వకేట్ అపర్ణ భట్ ఈ చిత్ర యూనిట్ పై పిటిషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.
చిత్రంలో లక్ష్మీ అగర్వాల్కు క్రెడిట్ ఇవ్వలేదని ఆరోపించారు అపర్ణ భట్. నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్ పోరాడిన తీరు, ఆమెకు న్యాయం జరగడం కోసం వాదించిన అపర్ణ భట్ తన ఫేస్బుక్లో ఓ పోస్టును పెట్టారు. ఆ పోస్టులో బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ ఆవేదనను వివరించారు. చపాక్ చిత్రం చూసిన తర్వాత లక్ష్మీ అగర్వాల్కు దక్కాల్సిన గౌరవం లేదా క్రెడిట్ చిత్ర బృందం ఇవ్వలేదని రాసుకొచ్చారు. లక్ష్మీ తరపున తాను పాటియాలా కోర్టులో న్యాయపరంగా పోరాటం చేశానని చెప్పుకొచ్చిన అపర్ణ... రేపు చిత్ర బృందంపై కేసు వేస్తే తన తరపున మరొకరు వాదిస్తారని ఇదే జీవితమంటూ పోస్టు చేశారు.
ఇక అపర్ణ పోస్టు చేయగానే చాలామంది నెటిజెన్లు ఆమెకు అండగా నిలుస్తూ పోస్టులు చేశారు. దీనికి తిరిగి అపర్ణ సమాధానం ఇస్తూ మరో పోస్టు చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ చపాక్ చిత్ర బృందంపై కోర్టులో కేసు వేస్తున్నట్లు వెల్లడించారు. లక్ష్మీ అగర్వాల్ జీవితంపై చిత్రం తీసి కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేదని చిత్ర బృందంపై మండిపడ్డారు. బాలీవుడ్ నిర్మాతలను ఎదుర్కొనేంత శక్తి తన దగ్గర లేదని కానీ ఇలా మౌనంగా ఉండటం వల్ల అన్యాయం జరిగిందన్న భావన కలుగుతోందని రాసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ అన్ని పరిణామాలకు సిద్ధపడే ఈకేసును వేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు అపర్ణ.
ఇదిలా ఉంటే చపాక్ చిత్రం విడుదల కాకముందే వివాదంలో చిక్కుకోవడం ఇది రెండో సారి. బుధవారం రోజున సోషల్ మీడియాలో ఓ పుకారు చక్కర్లు కొట్టింది. నిజజీవితంలో లక్ష్మీ అగర్వాల్పై యాసిడ్ దాడి చేసిన నిందితుడి పేరును బషీర్ నుంచి రాజేష్గా మార్చారంటూ వార్తలు హల్చల్ చేశాయి. నిందితుడి యొక్క మతంను దాచేందుకే ఇది జరుగుతోందని పుకార్లు షికారు చేశాయి. అయితే బుధవారం రోజున జరిగిన ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ సందర్భంగా అసలు విషయం బయటకు వచ్చింది. నదీమ్గా ఉన్న పేరును బషీర్గా మార్చడం జరిగింది.