కరీనా కపూర్తో బిజెపి సీఎం సెల్ఫీ:ఇదేం పని.. కాంగ్రెస్
రాయపూర్: ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ బాలీవుడ్ నటి కరీనా కపూర్తో సెల్ఫీ దిగడం విమర్శలకు దారి తీసింది. రాజధాని రాయ్పూర్లో శుక్రవారం రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ల ఆధ్వర్యంలో బాలల హక్కలపై జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ముగిసే సమయంలో.. రమణ్ సింగ్ తన స్మార్ట్ ఫోన్తో కరీనా కపూర్తో కలిసి సెల్పీ తీసుకున్నారు. ఈ దృశ్యం మీడియా కంటికి చిక్కిపోయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ రమణ్ సింగ్ పైన విరుచుకుపడింది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, సినీ తారలతో సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
దీనిపై అధికారులు స్పందిస్తూ... ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సాధారణంగానే చిన్నపిల్లలను తన ఫోన్లో ఫోటోలు తీస్తున్నారని, అందులో భాగంగా అతిథులతోను ఫోటోలు తీసుకున్నారని వివరణ ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమంలో 36 పాఠశాలలకు చెందిన 31 మంది బాలికలు, 5 ఉపాధ్యాయినిలను 'ఛత్తీస్గఢ్ రత్న'తో సత్కరించారు.
బీజేపీ సీనియర్ నేత రమణ్ సింగ్ 2003 నుంచి ఛత్తీస్గఢ్కు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పాలనలో సత్తా ఉన్న నేతగానే పేరుగాంచారు. ఆయన ఆ రాష్ట్రానికి తొలి సీఎంగానే కాక వరుసగా మూడో దఫా సీఎంగా ఎన్నికయ్యారు. నక్సల్స్ పైన ఉక్కుపాదం మోపిన ఆయన తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.