కింది ఉద్యోగి భార్యపై కలెక్టర్ అకృత్యం.. సీఎం సీరియస్.. సస్పెన్షన్, కేసు..
జిల్లాలో హయ్యర్ అథారిటీగా, ప్రజలకు తండ్రిలా సేవలందించాల్సిన ఆ కలెక్టర్.. కామంతో కళ్లుమూసుకుపోయి.. తన కింద పనిచేసే ఓ ఉద్యోగి భార్యపై కన్నేశాడు. మాట వినకుంటే భర్తను ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను జిల్లాను వదిలి ప్రమోషన్ పై వెళ్లిపోయాకగానీ బాధితురాలికి కనీసం ఫిర్యాదుచేసే ధైర్యంరాలేదు. ఛత్తీస్ గఢ్ లో కలకలం రేపిన ఈ ఘటనను సీఎం భూపేష్ భఘేల్ సీరియస్ గా తీసుకున్నారు. సదరు అధికారిని సస్పెండ్ చేసి, ఎంక్వైరీకి ఆదేశించారు.
వివరాల్లోకి వెళితే.. ఐఏఎస్ అధికారి జనక్ ప్రసాద్ పట్నాయక్ ప్రమోషన్ పై మే 26న రాజధాని రాయ్ పూర్ కు వచ్చి.. భూరికార్డుల విభాగంలో చేరాడు. మే 25 వరకూ 'జాంజ్గిర్- చంపా' జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆయన.. ప్రమోషన్ పై వెళ్లిపోవడానికి 10 రోజుల ముందు(మే 15న).. తన ఆధీనంలో పనిచేసే ఓ ఉద్యోగి భార్యపై అకృత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్ కు అసభ్య మెసేజ్ లు పంపిస్తూ వికృతానందం పొందేవాడు.
బాధితురాలు ధైర్యం చేసి బుధవారం 'జాంజ్గిర్- చంపా' ఎస్పీకి ఫిర్యాదు చేసింది. మెసేజ్ లు, రేప్ కు సంబంధించిన ఇతర ఆధారాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు సజావుగా సాగేలా నిందితుడైన అధికారిని పదవి నుంచి సస్పెండ్ చేస్తూ సీఎం భూపేష్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై ఐపీసీ 376, 506, 509బీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కీచక ఐఏఎస్ వార్తలు వైరల్ అయ్యాయి.