బీజేపీ దెబ్బ: ఎమ్మెల్యేల కొనుగోలుపై కాంగ్రెస్ ఆందోళన, చత్తీస్ గఢ్ లో 2003 సీన్ రిపీట్ ?
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ లో ఓటర్లు తీర్పు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆందోళన మాత్రం తప్పడంలేదు. చత్తీస్ గఢ్ లో అధికారంలోకి రావడానికి ఓటర్లు పూర్తి అధికారం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనందంగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోతారో అనే భయం కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటాడుతోంది. విషయం పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు చత్తీస్ గఢ్ నాయకులు పలు సూచనలు చేస్తున్నారు. చత్తీస్ గఢ్ లో 2003 సీన్ రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
బీజేపీకి సర్వే దెబ్బ
చత్తీస్ గఢ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని పలు సర్వేలు తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి 43 స్థానాలు, బీజేపీకి 40 స్థానాలు, ఇతరులు ఆరు స్థానాల్లో విజయం సాధిస్తారని సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వేల నేపథ్యంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ఆందోళన ?
చత్తీస్ గఢ్ లో అధికారంలోకి రావడానికి పూర్తి మెజారిటీ వచ్చినా ఆపరేషన్ కమల భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్ 10వ తేదీ మంగళవారం మద్యాహ్నం 12.30 గంటల సమయానికి కాంగ్రెస్ పార్టీ 66 స్థానాల్లో దూసుకుపోతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన నాయకులకు బీజేపీ గాలం వేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.
2003 సీన్ రిపీట్ ?
2003లో చత్తీస్ గఢ్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఏ పార్టీకి పూర్తి మెజారీ రాలేదు. ఆ సందర్బంలో ఎమ్మెల్యేలను గుర్రాలను కొనుగోలు చేసినట్లు చెయ్యడంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. తరువాత అనూహ్యంగా బీజేపీ అధికారంలో వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి రావడానికి పూర్తి మెజారిటీ వచ్చినా ఎక్కడ మా పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారో అని కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది.
సీఎంకు ఓటమి భయం
చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ ఓటమి భయంతో ఆందోళన చెందుతున్నారు. చత్తీస్ గఢ్ లో ఇంత కాలం పట్టు సాధించిన బీజేపీ నాయకులు ఈ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్నారు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వెయ్యాలని ప్లాన్ వేస్తున్నారు.
ఎమ్మెల్యేలకు ఆదేశం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించిన తరువాత ఎమ్మెల్యేలు అందరూ రాయ్ పూర్ రావాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడా జారిపోకుండా రాయ్ పూర్ చేరుకోవడానికి ఆ ఆ పార్టీ నాయకులు పక్కా ప్లాన్ వేస్తున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు జారిపోకుండా ఆ పార్టీ హైకమాండ్ అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది.