చిట్ఫండ్ స్కాంలో మాజీ సీఎం కొడుకు..
అంబికాపూర్ : ఛత్తీస్ఘడ్ మాజీ సీఎం రమణ్ సింగ్ కొడుకు అభిషేక్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఓ చిట్ ఫండ్ స్కాంలో అతనితో పాటు మరో 19 మందిపై కేసు నమోదైంది. మాజీ సీఎం కుమారుడితో పాటు బీజేపీ మాజీ ఎంపీ మధుసూదన్ యాదవ్, కాంగ్రెస్ నేత నరేష్ దకాలియాలపై సుర్గుజా జిల్లాలోని అంబికాపూర్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
కస్టమర్లను నిండా ముంచి బిచాణా ఎత్తివేసిన చిట్ ఫండ్ కంపెనీకి అభిషేక్, మధుసూదన్, దకాలియాలు స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించి లక్షల రూపాయలు వసూలు చేసిన సంస్థ 2016లో మూతపడింది. దీనిపై చిట్ ఫండ్ కంపెనీ ఇన్వెస్టర్, ఏజెంట్గా పనిచేసిన ప్రేమ్ సాగర్ గుప్తా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదుచేయగా పోలీసులు పట్టించుకోలేదు. దీంతో ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించారు. పిటీషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితులపై కేసు నమోదుచేయాలని ఆదేశించింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు అంబికాపూర్ పోలీసులు రమణ్ సింగ్ కొడుకు అభిషేక్, మధుసూదన్, దకాలియాతో పాటు 17 మంది అన్మోల్ ఇండియా కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదుచేసింది. ఐపీసీలోని సెక్షన్ 420 (చీటింగ్), సెక్షన్ 34 (కామన్ ఇంటెన్షన్)లతో పాటు ఛత్తీస్గఢ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇంట్రెస్ట్ యాక్ట్ 2005లోని పలు సెక్షన్లు కింద కేసు బుక్ చేశారు.