చలువ కళ్లద్దాలతో కరచాలనం: 'మిస్టర్ దబాంగ్ కలెక్టర్' అంటూ మోడీ వ్యాఖ్య
రాయ్పూర్: చలువ కళ్లద్దాలు పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం చెప్పినందుకు ఛత్తీస్గడ్ ప్రభుత్వం బస్తర్ జిల్లా కలెక్టర్ అమిత్ కటారియాపై అగ్గి మీద గుగ్గిలమైంది. అందుకు గాను ఆయనకు నోటీసులు జారీ చేసింది. చలువ కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం ఏం వచ్చిందో సమాధానం చెప్పాలని ప్రభుత్వం శుక్రవారంనాడు ఆయనకు నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వానికి వివరణ ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
రాష్ట్రపతి, ప్రధాని వంటి వివిఐపిలను కలిసినప్పుడు సివిల్ సర్వీసు అధికారులు చలువ లేదా నల్ల కళ్లద్దాలు ధరించకూడదనేది ప్రోటోకాల్ నిబంధన. ఆ నిబంధనను ఉల్లంఘించినందుకే కలెక్టర్కు నోటీసులు జారీ చేశఆరు. గత శనివారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ఛత్తీస్గడ్ పర్యటనకు వచ్చారు.
నక్సల్ ప్రభావిత బస్తర్ జిల్లాలో భారీ బహిరంగ సభలో మోడీ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన 24 వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
భవిష్యత్తులో అటువంటి చర్యకు పాల్పడకూడదని ప్రభుత్వం కలెక్టర్ను హెచ్చరించింది. నీలం రంగు చొక్కా, బ్రాండెడ్ సన్ గ్లాస్ ధరించి బస్తర్ కలెక్టర్ కటారియా మోడీతో కరచాలనం చేశారు. కరచాలనం చేస్తూ మిస్టర్ దబాంగ్ కలెక్టర్, ఎలా ఉన్నారంటూ అడిగారు. మోడీ వ్యాఖ్యలతో ఐఎఎస్ అధికారుల డ్రెస్ కోడ్పై చర్చ ప్రారంభమైంది.
కటారియాపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చెప్పారు. నోటీసు మాత్రమే జారీ చేసినట్లు తెలిపారు. అది ప్రొటోకాల్కు విరుద్ధమని చెప్పడానికే నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.