ఆ రాష్ట్రంలో 10, 12 వ తరగతి పరీక్షలు లేనట్టే !! పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచన
ఛత్తీస్గడ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10 వ తరగతి మరియు 12 వ తరగతి విద్యార్థులకు కరోనా వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ తో పరీక్షలను నిర్వహించలేదు . ఇక తాజాగా వార్షిక పరీక్షలను నిర్వహించబోమని ప్రకటించింది.రాష్ట్రంలో పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో ఉంది. అయితే ఇదివరకు రాసిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ రిజల్ట్ ను దీనికోసం ప్రామాణికంగా తీసుకోనున్నారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తుందని తెలుస్తుంది.
కరోనాతో వాయిదా పడిన పరీక్షలు .. ఎగ్జామ్స్ లేకుండా ప్రమోట్ చేసే ఆలోచన
ఇప్పటి వరకు విద్యార్థులకు నిర్వహించిన అంతర్గత పరీక్షల పేపర్ల యొక్క మార్కుల అంచనా ఆధారంగా ఫైనల్ గా నిర్వహించాల్సిన పరీక్షలకు బోర్డు మార్కులు ఇస్తుందని పేర్కొంది . కరోనావైరస్ కేసులు వ్యాప్తి చెందకుండా ఉండటానికి పరీక్షలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
లాక్ డౌన్ కారణంగా 10 వ తరగతి మరియు 12 వ తరగతి యొక్క కొన్ని ఐచ్ఛిక సబ్జెక్టులకు సిజిబిఎస్ఇ బోర్డు పరీక్షలు మార్చిలో అకస్మాత్తుగా వాయిదా వేయవలసి వచ్చింది. సిజిబిఎస్ఇ అధికారి అందించిన వివరాల ప్రకారం పరీక్షలు నిర్వహించకుండా అందరికీ గతంలో ఉన్న ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఉత్తీర్ణత సాధించేలా మార్కులు వేస్తారు.
చిన్న తరగతుల విషయంలో పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసిన ఛత్తీస్ గడ్ సర్కార్
కరోనావైరస్ వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ దృష్ట్యా, ఛత్తీస్ గడ్ ప్రభుత్వం 10 మరియు 12 తరగతులు మినహా అన్ని తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చెయ్యాలని నిర్ణయించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి భూపేశ్ బాగెల్ మార్చి 31 న నిర్ణయం తీసుకున్నారు. ప్రాణాంతకమైన వైరల్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి మార్చి 19 న రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలను మూసివేసింది. ఇక ఈ నేపధ్యంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణ దృష్ట్యా 1నుండి 9 తరగతుల వారిని పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసి కీలక నిర్ణయం తీసుకున్నారు .
పరీక్షలు నిర్వహించాలని రెండు సార్లు యత్నం .. చివరగా నో ఎగ్జామ్స్ .. ఓన్లీ ప్రమోట్
ఇక మరోమారు 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నం చేసింది. ఏప్రిల్ రెండవ వారంలో మే 12 నుండి మే 8 వరకు క్లాస్ 12 పరీక్షలను నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది అంతేకాదు 10 వ తరగతి పేపర్లు మే 4 మరియు మే 5 న జరుగుతాయని పేర్కొంది. కానీ లాక్ డౌన్ పొడిగింపు కారణంగా ఇది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు, తాజా పరిస్థితుల నేపధ్యంలో పరీక్షలను రద్దు చేయాలని, డైరెక్ట్ ప్రమోట్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం .