నవరాత్రుల్లో నరబలి: అమ్మోరికి భార్యను బలి ఇచ్చిన కిరాతకుడు: రోజుల కఠోర ఉపవాసం: అవయవాలతో
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నరబలిని ఇచ్చాడో కిరాతకుడు. నరబలిని సమర్పించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను అమ్మవారికి బలి ఇచ్చాడు. పైగా- తాను చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆమె అవయవాలతో పూజలు చేశాడు. దీన్ని పసిగట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతణ్ణి అరెస్టు చేశారు.
డబ్బు సంపాదించాలనే ఆశతో..
ఛత్తీస్గఢ్ సుర్గుజా జిల్లాలోని సర్గావ్లో మహార్నవమి నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ కిరాతకుడి పేరు సబ్బల్. భార్యతో కలిసి సర్గావ్లో నివాసం ఉంటున్నాడు. తరచూ క్షుద్రపూజలు చేస్తుంటాడనే పేరుంది అతనికి. దెయ్యాలను వదిలించడం వంటి చర్యలను చేస్తుంటాడు. దాని ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. భార్య వ్యవసాయ కూలీ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. అందుకే డబ్బు సంపాదించాలనే ఆశతో అమ్మోరికి నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.
ఎనిమిది రోజుల కఠోర ఉపవాస దీక్ష..
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఎనిమిది రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షను స్వీకరించి తొమ్మిదో రోజు నరబలి ఇస్తే.. కోరిన కోరికలు తీరుతాయని బలంగా నమ్మాడు. ఎనిమిది రోజుల పాటు ఉపవాసం అనంతరం తొమ్మిదో రోజు మహార్నవమి నాడు ఇంట్లో అమ్మవారికి భార్యను బలి ఇచ్చాడు. అమ్మవారి పటం ముందు భార్యను పొడిచి చంపాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోశాడు. వాటితో పూజలు చేశాడు. 24 గంటల పాటు అతని భార్య కనిపించకపోవడం, అతని ఇంట్లో నుంచి మంత్రాలు వినిపించడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వేర్వేరు స్టేట్మెంట్స్..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సబ్బల్ ఇంటికి వెళ్లారు. ఇంకిపోయిన రక్తపుమడుగులో, ముక్కలుగా కనిపించిన మృతదేహాన్ని చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. వెంటనే అతణ్ని అరెస్టు చేశారు. తమ విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. భార్యను హత్య చేయడానికి వేర్వేరు కారణాలను అతను వివరిస్తున్నాడని పేర్కొన్నారు. ఒక్కోసారి ఒక్కోరకంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడని చెప్పారు. డబ్బు సంపాదించాలనే ఆశతో నరబలి ఇచ్చినట్లు ఒకసారి, అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు మరోసారి చెబుతున్నాడని అన్నారు.