ఇక ప్రైవేట్ జులుం సాగదు.. ఫీజుల నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లో...
మహారాష్ట్ర,తమిళనాడు,ఢిల్లీ బాటలో ఛత్తీస్ఘడ్ సర్కార్ కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చట్టం ప్రకారం ఫీజుల నియంత్రణకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులనూ సభ్యులుగా నియమిస్తారు. తద్వారా ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులపై ఏకపక్ష నిర్ణయాలకు తావు ఉండదు.
అనిశ్చితిలో దేశ ఆర్థిక వ్యవస్థ... చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ షాకింగ్ కామెంట్స్..
కమిటీల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రాధాన్యత..
ముగ్గురు సభ్యులతో కూడిన ఛత్తీస్ఘడ్ కౌన్సిల్ కమిటీ ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిటీలు ఏర్పాటు చేయాల్సిందిగా జూన్ 14న ప్రభుత్వానికి ప్రతిపాదించింది. త్వరలో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే ప్రభుత్వం అంతర్గత సంకేతాల మేరకు రాష్ట్ర విద్యా శాఖ కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కమిటీలో విద్యార్థుల తల్లిదండ్రులకు తగిన ప్రాధాన్యత ఉంటుందని విద్యాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి చట్టపరమైన అన్ని అంశాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం చర్చల దశలో...
ఫీజుల నియంత్రణ కోసం తల్లిదండ్రులను భాగస్వాములుగా చేస్తూ ఇతర రాష్ట్రాలు ఏర్పాటు చేసిన కమిటీలు,వాటి పనితీరును మొదట పరిశీలించనున్నారు. కమిటీల ఏర్పాటుపై ప్రస్తుతం విద్యాశాఖ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని... ప్రిన్సిపల్ సెక్రటరీ అలోక్ శుక్లా తెలిపారు. 'ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి కమిటీలకు సంబంధించి చట్టాలను రూపొందించాయి. వాటన్నింటినీ అధ్యయనం చేస్తున్నాం. ఇలాంటి కమిటీల ఏర్పాటు తల్లిదండ్రులు,స్కూల్ యాజమాన్యానికి మధ్య సఖ్యత కుదిర్చేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.' అని చెప్పారు. విద్యాశాఖ దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తుందని.. అంతిమంగా కేబినెట్ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Recommended Video
తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో...
కరోనా లాక్ డౌన్ సందర్భంగా ప్రైవేట్ స్కూళ్లు విపరీతంగా ఫీజులు పెంచాయని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని పరిశీలించేందుకు మొదట మంత్రి ప్రేమసాయి సింగ్ నేత్రుత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి పరిష్కారంగా స్కూల్ యాజమాన్యంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులనూ భాగస్వామ్యం చేస్తూ ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయాలని సబ్ కమిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ ప్రతిపాదనపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.