12.30 గంటలకు 25శాతం.. ఛత్తీస్ గఢ్ లో కొనసాగుతున్న పోలింగ్
ఛత్తీస్ గఢ్ : ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మలిదశ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు 25 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. 72 స్థానాలకు గాను దాదాపు పదకొండు వందల మంది పోటీపడుతున్నారు. ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. పది గంటల వరకు 12.54 శాతం నమోదైన ఓటింగ్ మధ్యాహ్నం 12.30 కల్లా 25 శాతానికి పెరిగింది.
రెండో దశ పోలింగ్ లో భాగంగా మంగళవారం కొనసాగుతున్న 72 స్థానాలకు 1079 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 19మంది మహిళా నేతలున్నారు. రాయ్ పూర్ సౌత్ నుంచి అత్యధికంగా 46 మంది పోటీ చేస్తుంటే.. బింద్రానవ్ గఢ్ స్థానంలో అతి తక్కువగా ఆరుగురు అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.
మావోయిస్టు దాడులు జరిగే ఛాన్సుందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు అధికారులు. దాదాపు లక్షకు పైచిలుకు సెక్యూరిటీ సేవలు అందిస్తున్నారు. డ్రోన్లు, చాపర్లతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అదలావుంటే తమ గ్రామంలో మౌలిక సదుపాయాలు లేవంటూ పరేవపలి గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.