ఛత్తీస్గఢ్లో దారుణం... ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణ హత్య... పదునైన ఆయుధాలతో దాడి...
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుల్స్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చారు. ఇది మావోయిస్టుల ఘాతుకమా లేక వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగిందా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే... సుక్మా జిల్లాలోని బెజ్జీ పోలీస్ స్టేషన్లో పునెం హరమ(29),ధనిరాం కశ్యప్(31) అసిస్టెంట్ కానిస్టేబుల్స్గా విధులు నిర్వరిస్తున్నారు. గురువారం(ఏప్రిల్ 15) మధ్యాహ్నం ఏదో పని నిమిత్తం సమీప గ్రామానికి చెరో బైక్పై బయలుదేరారు. అయితే మార్గమధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అడ్డగించారు. మొదట ఇద్దరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం పదునైన ఆయుధాలతో ఇద్దరిని పొడిచి హత్య చేశారు.
కానిస్టేబుళ్లు హత్యకు గురైన విషయం తెలిసి పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టులే ఈ చర్యకు పాల్పడ్డారా లేక పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్పీ ధ్రువ్ వెల్లడించారు.
ఇటీవల ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-సుక్మా అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. నక్సల్స్ చేసిన దాడిలో దాదాపు 24 మంది జవాన్లు అమరులయ్యారు. మరో 31 మంది వరకు గాయపడ్డారు. దాడిలో రాకేశ్వర్ అనే సీఆర్పీఎఫ్ జవాను బంధీగా మావోయిస్టులకు చిక్కగా... రెండు రోజుల తర్వాత అతన్ని సురక్షితంగా విడుదల చేశారు.కూంబింగ్కి వెళ్లిన భద్రతా బలగాలపై నక్సల్స్ పక్కా ప్లాన్తో దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. హిడ్మా అనే మావోయిస్ట్ నాయకత్వంలో ఈ దాడి జరిగిందన్న ప్రచారం జరిగింది. దాదాపు దశాబ్ద కాలంగా దండకారణ్యంలో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు హిడ్మానే కారకుడిగా చెబుతున్నారు.