ఆసుపత్రిలో డాక్టర్లు లేక ఆటోలోనే ప్రసవం, ఎక్కడంటే?
రాయ్పూర్: ఆసుపత్రిలోనే వైద్యులు లేకపోవడంతో ఆటోలోనే ఓ మహిళ ప్రసవించిన ఘటన ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన ఆ మహిళకు ఆసుపత్రిలో కనీసం సిబ్బంది కూడ లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని కోరియా జిల్లాలోని ఓ ప్రభుత్వాసుపత్రి వద్ద ఈ ఘటన సోమవారం నాడు చోటు చేసుకొంది. కోరియాకు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి ఆటోలో వచ్చింది.
అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేరు. కనీసం కింది స్థాయి సిబ్బంది కూడ ఆసుపత్రిలో లేరు. దీంతో ఆసుపత్రి నుండి తిరుగు ప్రయాణానికి సిద్దమయ్యారు. కానీ, అదే సమయంలో బాధితురాలికి నొప్పులొచ్చాయి.
దీంతో ఆటోలోనే ఆమె సేద తీరేందుకు ప్రయత్నించింది. కానీ, నొప్పులు ఎక్కువ కావడంతో ఇరుగుపొరుగుతో పాటు బాధిత కుటుంబసభ్యులు ఆటోకు అడ్డుగా నిలబడి ఆ మహిళకు పురుడు పోశారు.
ఆమె ఆటోలోనే సురక్షితంగా ప్రసవించింది. ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిపించాలని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ, ఆసుపత్రుల్లో మాత్రం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శలు కూడ లేకపోలేదు. అయితే బాధితురాలితో పాటు ఆమె బిడ్డ కూడ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.