అన్నయ్యను కలుస్తాం: చోటారాజన్ చెల్లెళ్ల పిటిషన్
న్యూఢిల్లీ: ఇండోనేషియాలోని బాలిలో అరెస్టై ప్రస్తుతం ఢిల్లీలో సిబిఐ అధికారుల అదుపులో ఉన్న గ్యాంగ్స్టర్ చోటా రాజన్ను కలిసేందుకు ఆయన సోదరీమణులు వచ్చారు. తాము ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని ఇద్దరు సోదరిమణులు సిబిఐ కోర్టు అనుమతిని కోరుతూ శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు.
సిబిఐ కోర్టు ప్రత్యేక జడ్జి ఓఫీ సైనీ ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించారు. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ను అరెస్టు చేసేందుకు ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయనను ఇండోనేషియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో అదుపులోకి తీసుకున్నారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన చోటా రాజన్ ను ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. చోటా రాజన్ గతంలో అంతర్జాతీయ నేరగాడు దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం. ఆ తర్వాత ఇరువురు వేరయ్యారు. బద్ధ శత్రువులుగా మారిపోయారు.