దావూద్ ఇబ్రహీం, డీ కంపెనీకి షాక్ ఇచ్చిన చోటా షకీల్, మరో మాఫియా సామ్రాజ్యం!
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ను ఇంటలిజెన్స్ అధికారులు బయటకు చెప్పారు. ఇంత కాలం దావూద్ ఇబ్రహీం మాఫియా సామ్రాజ్యానికి కుడిభుజంగా ఉన్న చోట షకీల్ ఇప్పుడు డీ కంపెనీకి దూరం అయ్యాడని ఇంటలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
దావూద్ ఇబ్రహీంకు చెందిన వేల కోట్ల రూపాయల మాఫియా సామ్రాజ్యానికి డీ కంపెనీ అనే పేరు ఉంది. డీ కంపెనీ వ్యవహారాలు ఇంత కాలం దావూద్ ఇబ్రహీం, తరువాత అతని నమ్మినబంటు చోటా షకీల్ చూసుకునే వాడని అందరికీ తెలుసు.
దావూద్ ఇబ్రహీం తరువాత డీ కంపెనీ వారసుడు ఎవరు ? అనే విషయంపై మాఫియా సామ్రాజ్యాంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దావూద్ ఇబ్రహీం సోదరుడు అనీస్, చోటా షకీల్ మధ్య పోటీ అనివార్యం అయ్యిందని వెలుగు చూసింది.
దావూద్ ఇబ్రహీం సైతం డీ కంపెనీని సోదరుడు అనీస్ కు అప్పగించడానికి ఆసక్తి చూపించారని, అందుకే చోటా షకీల్ డీ కంపెనీ నుంచి బయటకు వెళ్లి ఇప్పుడు మరో మాఫియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. కరాచిలోని దావూద్ ఇబ్రహీంకు చెందిన క్లిఫ్టన్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన చోటా షకీల్ రహస్య ప్రాంతంలో తలదాచుకున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు అంటున్నాయి.