దావూద్ ఆచూకీపై ఛోటా షకీల్ సంచలన వ్యాఖ్యలు- భారత్, పాక్ ప్రభుత్వాలపై నిప్పులు...
1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన అంతర్జాతీయ నేరస్తుడు దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడని ఎట్టకేలకు పాకిస్తాన్ చేసిన ప్రకటన ఇప్పుడు సర్వత్రా కలకలం రేపుతోంది. ఇన్నాళ్లూ దావూద్ ఆచూకీ తమకు తెలియదంటూ బుకాయించిన పొరుగుదేశం.. అనూహ్యంగా కరాచీలో దావూద్ ఇంటి అడ్రస్ను వెల్లడించడంపై తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా దావూద్ ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ సీఎన్ఎన్-న్యూస్ 18తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దావూద్ ఆచూకీ, భారతీయ మీడియా పాత్ర వంటి అంశాలపై షకీల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.
దావూద్ ఆచూకీపై ఛోటా షకీల్
1993 ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీ కంపెనీ అధినేత, తన బాస్ దావూద్ ఇబ్రహీం కరాచీ అప్ మార్కెట్లోని క్లిఫ్టన్ ఏరియాలో ఉంటున్నట్లు పాకిస్తాన్ చేసిన ప్రకటనపై ఆతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ మండిపడ్డాడు. తాము పాకిస్తాన్లోనే ఉన్నామని ఎలా చెబుతారని ప్రశ్నించాడు. ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో ఎవరు ఏమైనా మాట్లాడొచ్చని, అందుకు తామెలా బాధ్యత వహిస్తామని షకీల్ ప్రశ్నించాడు. తమ ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయని చెప్పుకొచ్చాడు. అయితే ఆచూకీ చెబుతున్న వారే అందుకు బాధ్యత వహించాలన్నాడు.
మేం ఎవరికీ జవాబుదారీ కాదు..
దావూద్ ఇబ్రహీం ఆచూకీపై పాకిస్తాన్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ తామ పాకిస్తాన్కే కాదు భారత ప్రభుత్వానికీ జవాబుదారీ కాదని ఛోటా షకీల్ స్పష్టం చేశాడు. తమ ఆచూకీ చెప్పుకోవాల్సిన బాధ్యత తమది కాదన్నాడు. తాము కరాచీలో లేనప్పుడు అక్కడే ఉన్నామని మా తరఫున ఇతరులు ఎలా చెప్పుకుంటారని షకీల్ ప్రశ్నించాడు. మీడియా క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో ఎక్కడ ఏం కనిపించినా అది దావూద్ బంగ్లా, అది దావూద్ కారు అంటూ ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చన్నాడు. కానీ దావూద్ ఇబ్రహీం బంగ్లా అంటూ చూపించిన వారి పైనే దాన్ని నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుందని ఛోటా షకీల్ తెలిపాడు.
దావూద్ ఆచూకీ ప్రకటనపై భారత్ స్పందన...
దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనపై భారత్ స్పందించింది. ఐక్యరాజ్యసమితిలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చకుండా తప్పించుకోవడానికి పాకిస్తాన్ ఈ ప్రకటన చేసి ఉండొచ్చని తెలిపింది. తీవ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలు, తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై ఆంక్షలకు ఐక్యరాజ్యసమితి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ నుంచి ఇలాంటి ప్రకటన వచ్చి ఉండొచ్చని భారత్ అనుమానిస్తోంది. అయితే పాకిస్తాన్ చేసిన ప్రకటనతో ముంబై పేలుళ్ల కేసుతో పాటు పలు అంతర్జాతీయ తీవ్రవాద సంస్ధలకు నిధుల సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న దావూద్ ఇబ్రహీం చిక్కుల్లో పడటం ఖాయంగా తెలుస్తోంది.