వెజ్లో నాన్వెజ్ ముక్కలు.. అసెంబ్లీ క్యాంటీన్లో వెలుగుచూసిన నిర్వాకం
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ క్యాంటీన్లో దారుణం చోటుచేసుకుంది. వెజిటేరియన్ ఫుడ్ ఆర్డరిస్తే.. అందులో చికెన్ ముక్కలు దర్శనమిచ్చాయి. ఆ ఘటనపై ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తగిన విచారణ జరిపిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. వెజిటేరియన్ ఫుడ్లో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా క్యాంటీన్ నిర్వాహకులపై తగిన విచారణ జరిపిస్తామన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అజిత్ పవార్ క్యాంటీన్లో జరిగిన నిర్వాకాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీ క్యాంటీన్లో ఇలా జరగడం చాలా బాధాకరమని చెప్పుకొచ్చారు. అయితే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటామని పేర్కొన్నారు.
వెజిటేరియన్ ఫుడ్లో నాన్ వెజ్ ముక్కలు దర్శనమిచ్చిన ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపారు ఫడ్నవీస్. అసెంబ్లీ క్యాంటీన్లో వంటలు చేసేటప్పుడు పరిశుభ్రత నిబంధనలను పాటిస్తున్నారా? శుచిశుభ్రతతో ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) మార్గదర్శకాల ప్రకారం వంటకాలు చేస్తున్నారా? అనే అంశాలపై విచారణ జరుపుతున్నట్లు సభలో చెప్పుకొచ్చారు.
కేసీఆర్, జగన్కు కులతోకలు ఎందుకు.. నెట్టింట డైరెక్టర్ తేజ వ్యాఖ్యలు రచ్చ రచ్చ..!
అసెంబ్లీ క్యాంటీన్లో జరిగిన ఘటన దురదృష్టకరమని.. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని క్యాంటీన్ నిర్వాహకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. గత వారం ఓ ప్రభుత్వ ఉద్యోగి అసెంబ్లీ క్యాంటీన్లో మట్కీ ఉసాల్ అనే వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే ఆయన తినే సమయంలో చికెన్ ముక్కలు దర్శనిమిచ్చాయి. ఆ నోట ఈ నోట విషయం కాస్తా అసెంబ్లీ వరకు చేరడంతో నానా రచ్చయింది. మొత్తానికి ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వెంటనే స్పందించడంతో అక్కడికే ఫుల్స్టాప్ పడింది.