పీఎం కేర్ ఫండ్లో చైనా పెట్టుబడులున్నాయా?: రూ. 3076 కోట్లపై చిదంబరం ప్రశ్నలు
న్యూఢిల్లీ: పీఎం కేర్ నిధులను స్క్కూటినీ చేయడానికి వీళ్లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సీనియర్ కాంగ్రెస్ నేత పీ చిదంబరం గురువారం పలు సందేహాలను వ్యక్తం చేశారు. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన ఈ నిధులపై ట్విట్టర్ వేదిక కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలను సంధించారు.
కాగా, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఉద్దేశించిన పీఎం కేర్స్ నిధులను జాతీయ విపత్తు నిర్వహణ నిధి(ఎన్డీఆర్ఎఫ్)కు మళ్లించేలా ఆదేశించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ రెండూ వేర్వేరు లక్ష్యాలు కలిగిన వేర్వేరు నిధులని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది.
ఈ క్రమంలోనే చిదంబరం స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు అంతిమం అంటూనే.. పీఎం కేర్స్ ఫండ్ సేకరణకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. పీఎంకేర్స్ నిధికి మార్చి 2020 మొదటి ఐదు రోజుల్లో రూ. 3076 కోట్ల విరాళం అందించిన దాతలెవరు?, ఆ జాబితాలో చైనా కంపెనీలు కూడా ఉన్నాయా? అని చిదంబరం ప్రశ్నించారు.
కరోనా కార్యకలాపాలకు నిధి నుంచి డబ్బును కేటాయించే విధి విధానాలు ఏవి? అని ప్రశ్నించారు. లబ్ధిదారుల నుంచి యుటిలైజేషన్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారా? అని నిలదీశారు. ఈ నిధి సమాచార హక్కు పరిధిలోనికి రానట్లయితే.. దీని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఎవరు వెల్లడిస్తారని చిదంబరం ప్రశ్నించారు.
అంతేగాక, పీఎం కేర్స్ సంబంధించి పారదర్శకత, వివరాల వెల్లడి, నిర్వహణ పద్దతి తదితర అంశాలు కోర్టు ముందుకు రాలేదని చిదంబరం వ్యాఖ్యానించారు. ఈ నిధి చట్టబద్ధతను గురించి మాత్రమే కోర్టు తీర్పునిచ్చిందన్నారు. ఈ విషయంపై చర్చలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు పీఎం కేర్ ఫండ్పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. అనేక కుంభకోణాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలకు ఇలాంటి సందేహాలే వస్తాయని ఎద్దేవా చేస్తున్నారు.