నా కొడుకును చూసుకోండి: పీటర్, ఇంద్రాణితో చిదంబరం, సుప్రీంకోర్టులో ఈడీ
Recommended Video
న్యూఢిల్లీ: తన కుమారుడిని చూసుకోవాలంటూ మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ ప్రమోటర్స్ అయిన పీటర్, ఇంద్రాణి ముఖర్జియాలను కోరినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఎఫ్ఐపీబీ ఆమోదం కోసం పీటర్, ఇంద్రాణి తన వద్దకు వచ్చిన సమయంలో చిదంబరం ఈ మేరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
భారీ కుంభకోణం జరిగింది..
కాగా, ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆగస్టు 26 వరకు సుప్రీంకోర్టు చిదంబరంను అరెస్ట్ చేయవద్దని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చిదంబరంకు 11 స్థిరాస్తులు, 17 బ్యాంక్ అకౌంట్ చిదంబరంకు ఉన్నాయని, భారీ కుంభకోణం జరిగిందని.. ఈడీ పేర్కొంది. అందుకే తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఈడీ సుప్రీంకోర్టును కోరింది. సోమవారం చిదంబరం అప్పీల్పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.
మనవరాలి పేరుతో కూడా కంపెనీ..
పుట్టిన పేర్లతో షెల్ కంపెనీలను ఏర్పాటు చేశారని, ఓ ఒప్పందం మీద చిదంబరం మనవరాలి పేరు కూడా ఉండటం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని ఈడీ అధికారులు చెబుతున్నారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని, చిదంబరం అడిగిన అన్ని విషయాలకు సమాధానం చెబుతున్నారని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో విన్నవించారు.
రూ. 305 కోట్లు...
2007లో ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం.. ఐఎన్ఎక్స్ మీడియా గ్రూప్ 305 కోట్ల రూపాయల విదేశీ నిధులు స్వీకరించేందుకు విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డ్(ఎఫ్ఐపీబీ) నుంచి క్లియరెన్స్ ఇచ్చేశారు. ఇందులో భారీగా అవకతవకలు జరగడంతో చిదంబరం, అతని కుమారుడు కార్తీ చిదంబరంపై 2017లో ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
ఆధారాలున్నాయి.. దేశ విదేశాల్లో ఆస్తులు..
ఒక కంపెనీ నుంచి ఇతర షెల్ కంపెనీలకు డబ్బు తరలించినట్లు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని సీబీఐ తరపు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. చిదంబరంకు మన దేశంతోపాటు ఇతర దేశాల్లోనే ఆస్తులున్నాయని తెలిపారు. కాగా, సీనియర్ న్యాయవాదులు కల్ సిబాల్, అభిషేక్ మనూ మను సింఘ్వీలు చిదంబరం తరపున వాదించారు. చిదంబరంను కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని వీరు వాదించారు.