చిదంబం నాపై, మోడీ, అమిత్ షాలపై తప్పుడు కేసులు పెట్టారు, కానీ: నితిన్ గడ్కరీ
రాంచీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబంర బుధవారం బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ.. చిదంబరంకు వ్యతిరేకంగా ఈ కేసులో బలమైన ఆధారాలున్నాయని అన్నారు.
చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో తనపై, ప్రధాని నరేంద్ర మోడీ, హోమంత్రి అమిత్ షాలపై తప్పుడు కేసులు బనాయించారని నితిన్ గడ్కరీ మండిపడ్డారు. ఆ కేసుల విచారణలో తమకు క్లీన్చిట్ లభించిందని చెప్పారు. తాము ఎలాంటి నేరాలు, అవకతవకలకు పాల్పడలేదని తేలిందని చెప్పారు.
ప్రస్తుతం చిదంబరంపై నమోదైన కేసుల్లో ఆయనకు వ్యతిరేకంగాబలమైన ఆధారాలున్నాయి, విచారణ జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో కోర్టులో ఉందని.. న్యాయస్థానాలే తుది నిర్ణయం తీసుకుంటాయని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆయన అవకతవకలకు, అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కేసు నమోదు చేశారని, ఇందులో ఎలాంటి కుట్రలు లేవని చెప్పారు.
ఇక జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. జార్ఖండ్ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే ప్రజలు సీఎం రఘుబర్ దాస్కే ఓటువేసి తిరిగి ఎన్నుకుంటారన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్రంలో ఎక్కడా లేదని అన్నారు.
కాంగ్రెస్ పూర్తిగా జార్ఖండ్ నుంచి తొలగించబడిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. జేఎంఎం-కాంగ్రెస్ పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయంటే రాష్ట్రంలో బీజేపీ ఎంత బలంగా ఉందో తెలుసుకోవచ్చని ఆయన అన్నారు.
కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. బహిరంగ సభల్లో పాల్గొని బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలంటూ పిలుపునిచ్చారు. జార్ఖండ్ రాష్ట్రానికి తాను తండ్రిలా ఉంటానని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చే బాధ్యత తమదేనని నరేంద్ర మోడీ హామి ఇచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తామని చెప్పారు.