హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!
న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ కేసులో సీబీఐ అదుపులో ఉన్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఐఎన్ఎక్స్ కేసులో మనీ ల్యాండరింగ్కు సంబంధించి తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే కస్టడీకి సంబంధించిన నిర్ణయాన్ని వచ్చేనెల 5న వెల్లడిస్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీంతో చిదంబరానికి కాస్త రిలీఫ్ లభించినట్టైంది.
చిదంబరం దేశ వ్యతిరేక నేరం చేశారు, కస్టడీకి ఇవ్వాలి: కోర్టులో ఈడీ
జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం చిదంబరం పిటిషన్పై గురువారం విచారణ చేపట్టాయి. ఈ సందర్భంగా చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న చిదంబరం .. మరోసారి కస్టడీ గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేసు విచారణకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం ఈ నెల 30 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత ధర్మాసనం .. సెప్టెంబర్ 5న తీర్పు వెల్లడిస్తామని తేల్చిచెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించడం .. సుప్రీంకోర్టు రెండురోజుల తర్వాత విచారిస్తామని చెప్పడంతో సీబీఐ అధికారులు అరెస్గ్ చేసిన సంగతి తెలిసిందే. తొలుత 5 రోజులు .. తర్వాత 4 రోజులు సీబీఐ కస్టడీలో ఉన్నారు చిదంబరం. రెండో విడత కస్టడీ రేపటితో ముగియనుంది. ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.